
పుర ఆదాయానికి గండి
రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేని ఇళ్లు, దుకాణాల సముదాయాన్ని గుర్తించడంలో ఆశాఖ అధికారులు విఫలమవుతున్నారు. సరైన చర్యలు చేపట్టకపోవడంతో పుర ఆదాయానికి గండి పడుతోంది. మున్సిపాలిటీ పరిధిలో రామాయంపేట, గుల్పర్తి, కోమటిపల్లి గ్రామాలతో పాటు రామాయంపేట, కోమటిపల్లి తండాలు ఉన్నాయి. మొత్తం జనాభా 17,860 ఉండగా, 5,500 గృహాలు ఉన్నాయి. గతంలో భువన్ యాప్ ద్వారా సర్వే నిర్వహించిన ఆశాఖ అధికారులు అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని వాటిని గుర్తించారు. ఈ మేరకు వారు ఇంటింటికీ తిరిగి కొలతలు సేకరించి వివరాలు రూపొందించారు. ఇళ్లతో పాటు వ్యాపారవర్గాలకు సంబంధించి 130 వరకు అనుమతి లేనివి ఉన్నాయని అప్పటి సర్వేలో తేల్చారు.
అనుమతి ఒకటి.. నిర్మాణం మరోటి
పట్టణంలో చాలా మంది కేవలం ఒక అంతస్తు నిర్మాణానికి మాత్రమే అనుమతి పొంది ఏకంగా మూడు, నాలుగు అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. పన్ను భారం తగ్గించుకోవడానికి పెద్ద, పెద్ద భవనాలు ఉన్న వారు సైతం తమకు ఒక అంతస్తు మాత్రమే ఉందని రికార్డుల్లో నమోదు చేయించుకున్నారు. రాజకీయంగా ముడిపడి ఉన్న అంశం కావడంతో అధికారులు సైతం పట్టించుకోలేదు. గతంలో అనుమతి లేని నిర్మాణాలను కాదని, మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం 20 వరకు మాత్రమే అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు చెబుతున్నారు. నామమాత్రంగా కొన్ని అనుమతి లేని వాటిని గుర్తించారు. అయితే సర్వేలో అనుమతి లేని నిర్మాణాలను గుర్తించిన అధికారులు వాటికి జరిమానా విధించాలి. వాటిని ఎప్పుడు నిర్మించారో వివరాలు సేకరించి అప్పటినుంచి పన్ను వసూలు చేయాలి. ఒక అంతస్తుకు మాత్రమే అనుమతి తీసుకొని రెండు, మూడు అంతస్తులు నిర్మించుకున్న వారికి సైతం ఇదే వర్తింపజేయాలి. అనుమతి లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలకు సంబంధించి పనులు నిలిపివేయాల్సి ఉంటుంది.
పేట మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు
20 లోపే అక్రమ నిర్మాణాలు
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేని నిర్మాణాలు 20 లోపే ఉన్నట్లు తమ సర్వేలో తేలింది. ఈ మేరకు వారికి నోటీసులు అందజేశాం. గతంలో గుర్తించిన అనుమతి లేని ఇళ్ల సంఖ్య తనకు తెలియదు.
– దేవరాజ్, టీపీఓ