చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలోని మల్లన్నగుట్ట వద్ద ఏర్పాటు చేస్తున్న పోలీస్ ఫైరింగ్ శిక్షణ కేంద్రం పనులను ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఫైరింగ్ ప్రాక్టీస్ కోసం వేరే జిల్లాకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. జిల్లాలో ఫైరింగ్ రేంజ్ కల సాకారం కాబోతుందన్నారు. మే 2న ఐజీ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్, ఆర్ఐ శైలేందర్, ఎస్ఐ అమ్మద్ మోహినోద్దీన్ ఉన్నారు.
కల్లుదుకాణాలపై ఎక్సైజ్ దాడులు ఆపాలి: మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్
చిన్నశంకరంపేట(మెదక్): గ్రామాల్లోని కల్లుదుకాణాలపై ఎక్సైజ్ శాఖ అధికారులతో దాడులు చేయిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నదని, వెంటనే దాడులు ఆపాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన కామారెడ్డి జిల్లా నందిపేట్ వెళ్తూ నార్సింగి మండల కేంద్రంలోని రేణుకామాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు ఆయనను సత్కరించి, తమ సమస్యలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో గౌడ్ కలస్తులకు సరైన గౌరవం దక్కిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అణచివేసేందుకు చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మల్లేశంగౌడ్, గౌడ సంఘం నాయకులు సిద్దాగౌడ్, యాదాగౌడ్, ప్రవీణ్గౌడ్, శ్రీకాంత్గౌడ్, బాల్రాజ్గౌడ్, రాజుగౌడ్ ఉన్నారు.
అంగన్వాడీల అరెస్టు అన్యాయం: సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్రెడ్డి
శివ్వంపేట(నర్సాపూర్): అంగన్వాడీల న్యాయ మైన సమస్యలపై ఉద్యమిస్తే పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం చలో హైదరాబాద్కు వెళ్తున్న అంగన్వాడీలను ముందస్తు అరెస్టు చేయడంపై తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శివ్వంపేట పోలీస్స్టేషన్లో అరెస్టు అయిన అంగన్వాడీలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లకు పెంచిన వేతనాలతో పాటు 11 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయబద్ధంగా హక్కులను సాధించుకునే వారి ని ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తే తగిన గుణ పాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమ ంలో అంగన్వాడీ టీచర్లు హేమలత, విజయలక్ష్మి ఫాహీం, మ్యూనిస, జ్యోతి ఉన్నారు.
గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు
కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రమైన కౌడిపల్లి, తునికిలోగల ఎంజేపీ (మహాత్మ జ్యోతిబాపూలే) బీసీ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ హరిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్మీడియెట్ ఎంజేపీ బీసీ గురుకుల కళాశాలలో అడ్మిషన్లు పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది నుంచి ఎలాంటి పోటీ పరీక్ష లేకుండా విద్యార్థులకు పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఫైరింగ్ రేంజ్ పనుల పరిశీలన