వాన గుబులు.. రైతు దిగులు | - | Sakshi
Sakshi News home page

వాన గుబులు.. రైతు దిగులు

Apr 11 2025 8:51 AM | Updated on Apr 11 2025 8:51 AM

వాన గుబులు.. రైతు దిగులు

వాన గుబులు.. రైతు దిగులు

మెదక్‌జోన్‌: అకాల వర్షం అన్నదాతను వెంటాడుతోంది. ఏటా మొలకనాడు ఎండ.. కోతనాడు వానతో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో వరి కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న తరుణంలో వర్షాలు వణుకు పుట్టిస్తున్నాయి. గురువారం రేగోడ్‌లో భారీ వర్షం కురిసింది. మెదక్‌, చిన్నశంకరంపేట, తూప్రాన్‌ తదితర మండలాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. దీంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొస్తున్న వేళ వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలో ఇటీవల ప్రభుత్వం కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. వరి పంట కోసిన వారు వాన నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. రోడ్ల వెంట ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్ద కాగా కుప్పలపై ప్లాస్టిక్‌ కవర్లు కప్పి ఉంచుతున్నారు. మరికొందరు వరి కోయాలా..? వద్దా అని ఆలోచిస్తున్నారు. వర్షం వస్తే పొలాల్లో పనులు సాగవని, హార్వెస్టర్లు దిగబడటంతో కోతలకు కష్టం అవుతుందంటున్నారు. గతేడాది ఇదే విధంగా వర్షం రావడంతో కొనుగోలు కేంద్రాల్లోనే వందల క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్ద అయింది. చాలా మంది రైతులు తడిసిన ధాన్యాన్ని అతి తక్కువ ధరకు మిల్లర్లకు విక్రయించి తీవ్ర నష్టాలు చవి చూశారు. ప్రస్తుత వర్షాలకు తేమశాతం రాకపోవడంతో నానా తంటాలు పడాల్సి వస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయాలంటే తేమ శాతం 17 ఉండాలి. లేనిచో నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయడానికి నిరాకరిస్తారు. గత నెలలో కురిసిన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి జిల్లాలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా 386 విద్యుత్‌ స్తంభాలు విరిగిపోగా 16 ట్రాన్స్‌ఫార్మర్లు విరిగిపోయాయి. ట్రాన్స్‌కోకు సుమారు రూ. 1.80 కోట్ల నష్టం వాటిల్లింది. అలాగే వందలాది రైతుల మోటార్లు కాలిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement