ఉట్నూర్రూరల్: గిరిజనుల పునరావాస సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. కడెం మండలానికి చెందిన గోండు గిరిజనులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం మాజీ ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో పీవోను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. జిల్లా అటవీ అధికారి, కలెక్టర్, ఆర్డీవో, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. గిరిజనుల సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదల, హక్కుల పరిరక్షణకు ఐటీడీఏ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. గిరిజనులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా పరిష్కార మార్గాలు వేగవంతం అవుతాయన్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన నివేదికలను సిద్ధం చేసి సంబంధిత ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు వెల్లడించారు.


