ఉట్నూర్రూరల్: గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. మంగళవారం పీవో చాంబర్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్, మిషన్ భగీరథ అధికారులతో గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలన్నారు. పైప్లైన్ లీకేజీలు, మోటార్లలో లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, విద్యుత్ సరఫరా మెరుగుదల, అంగన్వాడీ భవనాల నిర్మాణం, ఆశ్రమ పాఠశాలల మరమ్మతు పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలన్నారు. ప్రతీశాఖ సమన్వయంతో పనిచేస్తే ఆశించిన ఫలితాలు సాధ్యమన్నారు.


