మంచిర్యాలక్రైం: చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత నెల 23న జిల్లా కేంద్రంలోని గౌతమేశ్వరకాలనీకి చెందిన ముదాం నగేష్ ఇంట్లో 376 గ్రాముల బంగారం, కిలో వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం మంచిర్యాల బస్టాండ్ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన (ప్రస్తుతం మహారాష్ట్ర, చంద్రాపూర్లో నివాసం ఉంటున్నారు) ఆశిష్ శ్రీనివాస్, రెడ్డిమల్ల ఆకాష్ను విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 311 గ్రాముల బంగారం, కిలో వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగితా 65 గ్రాముల బంగారు నగలను స్థానిక ముత్తుట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టినట్లు పేర్కొన్నారు. కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ శ్రీనివాస్పై మహారాష్ట్రలో 12కు పైగా కేసులున్నట్లు విచారణలో గుర్తించామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి దొంగలను పట్టుకున్న ఐడీ పార్టీ పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించి, ప్రత్యేక రివార్డులను అందజేశారు. సమావేశంలో ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్ రావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


