చెన్నూర్: మండలంలోని లంబాడిపల్లి సమీపంలో ఇటుకబట్టీ కంపెనీలో బాల కార్మికులతో పని చేయిస్తున్నారనే సమచారం మేరకు స్థానిక సివిల్ జడ్జి పర్వతపు రవి ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల లేబర్ అధికారులు దాడి చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ అసిస్టెంట్ లేబర్ అధికారి బొరంపూడి సత్యనారాయణతో కలిసి వివరాలు వెల్లడించారు. ఎంఎస్ఎం బ్రిక్స్ కంపెనీలో ఒడిశాకు చెందిన రెండు కుటుంబాల్లోని పది మందికి పైగా పని చేస్తున్నారని తెలిపారు. ఇద్దరు మైనర్ బాలబాలికలతో యజమాని పని చేయిస్తున్నట్లు గుర్తించారని అన్నారు. కార్మికులకు విముక్తి కల్పించి ఒడిశాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. లేబర్ అధికారుల ఫిర్యాదు మేరకు ఇటుకబట్టీల యాజమాని సయ్యద్ మోసిన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో అసిస్టెంట్ లేబర్ అధికారులు దుర్గం క్రాంతికుమారు, మెరుగు శ్రీకాంత్, భీమారం ఎస్సై పాల్గొన్నారు.


