నర్సాపూర్ (జి): సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు ఎస్సారెస్పీ సుద్దవాగులో నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నర్సాపూర్ (జి) మండల కేంద్రానికి చెందిన ఎంఏ రిజ్వాన్ ఉద్దీన్ (20), అబ్దుల్ అర్షద్ (22) తమ స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ సుద్దవాగుకు ఈత కోసం వెళ్లారు. వాగులో నీటి లోతు అంచనా వేయలేక ఇద్దరు నీట మునిగారు. స్థానికులు వాగులో గాలించగా అప్పటికే అబ్దుల్ అర్షద్, రిజ్వాన్ ఉద్దీన్ మృతి చెందారు. చేతికి అందివచ్చిన కొడుకులు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.


