డిపాజిట్‌ డబ్బులు చెల్లించాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

డిపాజిట్‌ డబ్బులు చెల్లించాలని ఆందోళన

Apr 14 2026 8:10 AM | Updated on Apr 14 2026 8:10 AM

మందమర్రిరూరల్‌: డిపాజిట్‌ చేసిన డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మందమర్రి మార్కెట్‌లోని సహారా ఇండియా కార్యాలయం ఎదుట డిపాజిట్‌ దారులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సదరు సంస్థలో డిపాజిట్‌ చేసిన డబ్బుల కాలపరిమితి ముగిసి నాలుగైదేళ్లు కావస్తున్నా ఇవ్వడంలేదన్నారు. కార్యాలయంలో అడిగితే పొంతనలేని సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించే విధంగా చూడాలని కోరారు. అనంతరం కార్యాలయంలో మేనేజర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బాధితులు వెంకటయ్య, సంజీవ్‌, రాజమౌళి, నరేష్‌బాబు, సంపత్‌, మధు, మల్లేశ్వరి, రమాదేవి, లక్ష్మి, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

తాంసి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలు వురికి తీవ్ర గాయాలైన సంఘటన గుడిహత్నూర్‌ మండలంలోని సీతాగొంది స మీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాంసికి చెందిన పది మంది మహిళలు ఆదివారం ఉదయం మ్యాక్స్‌ వాహనంలో నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌కు వెళ్లి వస్తుండగా సీతాగొంది సమీపంలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో అందులో ప్రయాణిస్తున్న సోమ హేమలత (62) అక్కడికక్కడే మృతి చెందగా సోమ సుజాత, బొంత గంగామాత, వాసవి, మంత్రి శ్రీదేవి, మంత్రి అనిత, వినోద, లక్ష్మి, లావణ్యకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. సోమ సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గుడిహత్నూర్‌ ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

వ్యాపారిపై మొక్కజొన్న రైతుల ఫిర్యాదు

ముధోల్‌: మొక్కజొన్న పంటను వ్యాపారికి అమ్మి రైతులు మోసపోయిన సంఘటన మండలంలోని మచ్కల్‌లో చోటు చేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా దాండారి మండలం గురిజన తండాకు చెందిన అమర్‌సింగ్‌ అనే వ్యాపారి మచ్కల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో 15 రోజులుగా మక్కలు కొనుగోలు చేస్తున్నాడు. ఆదివారం మచ్కల్‌కు చెందిన సూర్యవంశీ ప్రకాష్‌ పటేల్‌ 180 క్వింటాళ్లు, సూర్యవంశీ సుధాకర్‌ పటేల్‌ 45 క్వింటాళ్లు, ఆనంద్‌రావు 110 క్వింటాళ్లు విక్రయించారు. సదరు వ్యాపారి పంటను వాహనంలో లోడ్‌ చేసుకుని రైతులకు డబ్బులు చెల్లించి వెళ్లిపోయాడు. ఆతర్వాత రైతులు లెక్కలు వేసుకోగా క్వింటాలుకు పదికిలోల చొప్పున తక్కువగా తూకం వేసినట్లు గుర్తించారు. ప్రకాష్‌పటేల్‌ రూ.లక్షా 13వేలు, సుధాకర్‌పటేల్‌ రూ.32,650, ఆనంద్‌రావు రూ.73,700 నష్టపోయినట్లుగా తెలుసుకున్నా రు. సదరు వ్యాపారిని ఫోన్‌ ద్వారా సంప్రదించగా మీముందే తూకం వేశానని, మీ ఇష్టం వ చ్చిన చోట చెప్పుకోండని సమాధానం ఇ చ్చాడు. దీంతో సదరు రైతులు సోమవారం పో లీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు న మోదు చేసినట్లు ఎస్సై బిట్ల పెర్సిస్‌ తెలిపారు.

నాలుగు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

లోకేశ్వరం: మండలంలోని సాథ్‌గాం, బిలోలి గ్రామాల సమీపంలో సుద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై అశోక్‌ తెలిపారు. తహసీల్దార్‌ రవీందర్‌ ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5 వేలు జరిమానా విధించినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement