
● ఇంటి నంబర్కు రూ.50 వేలు ● ఇంటి నిర్మాణానికి రూ.లక్ష చొప్పున వసూలు
చెన్నూర్: అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలకు చెన్నూర్ మున్సిపాలిటీ అడ్డాగా మారింది. మున్సి పల్ అధికారుల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల అండదండలతో కొందరు వ్యక్తులు ప్రభుత్వ అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. ప్రభు త్వ నిబంధనలు తుంగలో తొక్కి అక్రమార్కులు అట్టి స్థలంలో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు.
వందలాది ఎకరాలు అన్యాక్రాంతం
చెన్నూర్ పట్టణ సమీపంలోని గెర్రెకాలనీతో పాటు జాతీయ రహదారి పక్కన, కత్తరశాల రోడ్డులో 169, 168, 153 సర్వే నంబర్లలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. గెర్రె కాలనీ లోని ప్రభుత్వ భూమిని గతంలో నిరుపేదలకు ఇళ్లస్థలాలకోసం ఇచ్చారు. అందులో కొంతమంది ని రుపేదలు ఇంటి నిర్మాణాలు చేపట్టి నివాసం ఉంటున్నారు. గెర్రెకాలనీ పక్కన జాతీయ రహదారి ని ర్మాణం కావడంతో ఆ ప్రాంత భూములకు డిమాండ్ పెరిగింది. దీంతో రియల్టర్లు ప్రభుత్వ భూములను కబ్జా చేసి అమ్మకానికి తెరలేపారు. పట్టా భూముల కంటే అసైన్డ్ భూములు తక్కువ ధరకు రావడంతో చెన్నూర్తో పాటు కోటపల్లి, వేమనపల్లి మండలాలకు చెందిన వందలాది మంది వాటిని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు.
ఇంటినంబర్కు రూ.50 వేలు
నిబంధనల ప్రకారం పట్టా భూముల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి లభిస్తుంది. ప్రభుత్వ భూముల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి లభించదు. నిర్మాణ దారులు ముందుగా మున్సిపాలిటీ నుంచి ఇంటినంబర్ తీసుకుని దాని ప్రకారం నిర్మాణాలు చేపడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ భూముల్లో ఇంటి నంబర్ ఇవ్వాలంటే అధికారులు రూ.50 వేలు, ఇంటి నిర్మాణానికి రూ.లక్ష చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం పట్టా భూముల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకుని నిర్మాణం ప్రారంభిస్తే ఇంటినంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మున్సిపల్ అధికారులు అసైన్డ్ భూముల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టకముందే ఇంటినంబర్లు ఇచ్చినట్లు తెలిసింది.
మినీ స్టేడియం సమీపంలో చేపట్టిన అక్రమ నిర్మాణం
చర్యలు తీసుకుంటాం
మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. ఇంటినంబర్ల విషయం కూడా నా దృష్టికి రాలేదు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే ఎవరినీ ఉపేక్షించేది లేదు.
– గంగాధర్ మున్సిపల్ కమిషనర్, చెన్నూర్

కత్తెరశాల రోడ్డులో చేపట్టిన అక్రమ నిర్మాణం
