కారిడార్‌ ఇక కన్జర్వేషన్‌! | - | Sakshi
Sakshi News home page

కారిడార్‌ ఇక కన్జర్వేషన్‌!

Jun 4 2025 12:08 AM | Updated on Jun 4 2025 12:08 AM

కారిడార్‌ ఇక కన్జర్వేషన్‌!

కారిడార్‌ ఇక కన్జర్వేషన్‌!

● ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ డివిజన్లలో చర్యలు ● పులుల సంరక్షణ ప్రాంతంగా మార్పు ● భవిష్యత్‌లో కొత్త టైగర్‌జోన్‌కు అవకాశం ● పులుల పేరుతో ఆంక్షలపై స్థానికుల వ్యతిరేకత

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చే పులులకు ప్రధాన కారిడార్‌గా ఉన్న ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ డివిజన్లు ‘టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వు’గా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాంతం కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు పరిధిలోనే పులుల రాకపోకలకు కీలకంగా ఉంది. దీంతో పులుల సంరక్షణకు వీలు కలుగనుంది. ఉమ్మడి జిల్లా పరిధి ఆసిఫాబాద్‌లో అధికంగా పులుల సంచారం పెరుగుతోంది. అయితే సంరక్షణ చర్యలు చేపట్టినా, పరిమిత అధికారులు మాత్రమే ఉండేది. తాజాగా టైగర్‌ రిజర్వుగా ఏర్పాటు చేయడంతో పులుల సంరక్షణకు మరిన్ని ప్రత్యేక కార్యకలాపాలు చేయాల్సి ఉంది. ఏదైనా ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం టైగర్‌ రిజర్వుగా గుర్తించాలంటే ముందుగా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, కన్జర్వేషన్‌ రిజర్వుగా కొనసాగుతున్న వాటికే అనుమతి ఇస్తుంది. భవిష్యత్‌లో కేంద్రం నుంచి కొత్తగా టైగర్‌ రిజర్వుగా ఏర్పాటుకు అవకాశం కలుగనుంది.

నివాసాలు

కాగజ్‌నగర్‌ డివిజన్‌ నుంచి బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, జన్నారం వరకు పులుల సంచారం ఉంటోంది. మొదట అధికారులు జన్నారం కోర్‌ ప్రాంతంగా టైగర్‌ రిజర్వు ఏర్పాటు చేశారు. అక్కడి పరిస్థితులు పులుల ఆవాసానికి అనుకూలంగా లేకపోవడంతో చుట్టపు చూపులా వచ్చి వెళ్తూ.. నివాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. మరోవైపు ప్రాణహిత, పెద్దవాగు, గోదావరి తీరాల్లో కాగజ్‌నగర్‌ నుంచి చెన్నూరు, బెల్లంపల్లి డివిజన్ల వరకు పులుల సంచారం పెరుగుతోంది. ముఖ్యంగా కాగజ్‌నగర్‌ డివిజన్‌లో కాగజ్‌నగర్‌, పెంచికల్‌పేట్‌, బెజ్జూరు, దహెగాం, పరిధిలో నివాసాలు ఉన్నాయి. ఇక వేమనపల్లి, చెన్నూరు, కోటపల్లి పరిసరాల్లోనూ సంచారం ఉంది. కోర్‌ ప్రాంతంగా ఉన్న కవ్వాల్‌ వరకు వెళ్లకపోగా ఇక్కడే స్థిర నివాసం ఎక్కువగా ఏర్పర్చుకుంటున్నాయి. పాల్గుణ అనే ఆడపులి సంతతితోపాటు కే, ఎస్‌, పీ, ఏ సిరీస్‌ పేర్లతో ఉన్న పులులన్నీ ఇక్కడి పరిధిలోనివే. పులులు జతకట్టి సంతానాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి. వేట, మానవ కార్యకలాపాలతో జాతీయ జంతువులకు ముప్పు పొంచి ఉంది.

రక్షణకు పకడ్బందీగా చర్యలు

ఉమ్మడి జిల్లా విస్తరించిన కవ్వాల్‌ అభయారణ్యంలో బఫర్‌ ఏరియాలో ఉన్న ఆసిఫాబాద్‌ జిల్లా ఉంది. 1.40లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణంతో ఉన్న రెండు డివిజన్లలో ఈ టైగర్‌ కన్జర్వేషన్‌గా మార్చడంతో మరిన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. పులులు సంచరించే ప్రాంతాల్లో మానవ కార్యకలాపాలు పూర్తిగా తగ్గించడంతోపాటు పలు నిషేధిత ఆజ్ఞలు అమలులో ఉండనున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వేటాడడం, విద్యుత్‌ కంచెలు అమర్చడం, వన్యప్రాణులకు హాని తలపెట్టే వీలు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది.

స్థానికుల వ్యతిరేకత

ఉమ్మడి జిల్లా పరిధిలో కవ్వాల్‌ కోర్‌ గ్రామాలతోపాటు సంచారం అధికంగా ఉన్న కారిడార్‌ ప్రాంతాల్లోనూ ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో అటవీ సమీప గ్రామాలతోపాటు గిరిజన, ఆదివాసీల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే కన్జర్వేషన్‌ రిజర్వుగా ప్రకటించినప్పటికీ నిరసనలు ప్రారంభమయ్యాయి. పోడు రైతులతోపాటు రెవెన్యూ పరిధిలో ఉన్న చోట్ల కూడా పులుల సంచారంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయంతోపాటు తమ రోజువారీ కార్యకలాపాలకు అడ్డుగా నిలుస్తుందనే కన్జర్వేషన్‌ ఉత్తర్వులు ఎత్తివేయాలని డిమాండ్లు చేస్తున్నారు. కన్జర్వేషన్‌గా మార్పుపై కవ్వాల్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌(ప్రాజెక్టు టైగర్‌) శాంతారామ్‌ను సంప్రదించగా, స్థానికంగా తమకు ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement