
రేషన్కు బారులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో ఇటు డీలర్లు.. అటు లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు. వేలిముద్రలు, సర్వర్ బిజీతోపాటు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులకు ఒక్కో యూనిట్కు ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తుండగా.. ఇందులో ఐదు కిలోలు కేంద్రం, ఒక కిలో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నాయి. దీంతో ఐదు కిలోలు తీసుకోవాలంటే ఒకసారి, కిలో కోసం మరోసారి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. మూడు నెలల రేషన్ ఒకేసారి తీసుకోవడానికి ఒక్కో నెలకు రెండుసార్లు లెక్కన ఈ–పాస్ యంత్రంపై మొత్తం ఆరుసార్లు వేయాల్సి వస్తోంది. ఒక్కొక్కరికి బియ్యం తూకం వేసి పంపిణీ చేసేందుకు 20నిమిషాలకు పైనే సమయం పడుతోంది. ఒక్కో దుకాణంలో రోజువారీగా లబ్ధిదారులకు బియ్యం ఇచ్చేందుకు గంటల తరబడి సమయం పడుతోంది. గతంలో 200మందికి పంపిణీ చేసేది కేవలం 60మంది వరకు పంపిణీ జరుగుతోంది. మూడు నెలలు ఒకేసారి కావడంతో మరింత ఎక్కువ సమయం పడుతోంది. ఈ నెల 30వరకు పంపిణీ చేసేందుకు గడువు విధించారు.
జాప్యంతో ఇబ్బందులు
సన్నబియ్యం పంపిణీతో గతంలో కంటే ఎక్కువగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. ఈ నెల కోటాలో ఒక్కో లబ్ధిదారుకు వేలిముద్రతోనే బియ్యం తూకం వేయాల్సి ఉంటుంది. సరిపడా తూకం వేశాకే రశీదు వస్తుంది. తూకం వేసే సమయంలో సర్వర్ బిజీ వచ్చినా, వేలిముద్ర పడకపోయినా మరోసారి వేయాల్సి వస్తోంది. ఉదాహరణకు ఒక రేషన్ కార్డులో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున 24కిలోలు ఇవ్వాలి. అలా మూడు నెలలకు కలిపి 72కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. వేలిముద్రలు ఐదుకిలోలకు ఒకసారి, ఒక కిలోకు మరోసారి అలా మూడు నెలల కోసం ఇవ్వాలి. వేలి ముద్ర చూస్తూ వాటికి సమంగా బియ్యం తూకం వేయాలి. దీంతో లబ్ధిదారులు నిలబడి ఎదురు చూడాల్సి వస్తోంది. నేరుగా బియ్యం స్టాక్ పంపి గన్నీ సంచి బరువు తీసి వేసి తమకు బియ్యం కోటా కేటాయించాలని డీలర్లు కోరుతున్నారు. షాపుల్లో కోటా కన్నా తక్కువగా వస్తే లబ్ధిదారులతో ఇబ్బంది పడాల్సి వస్తోందని అంటున్నారు. ప్రస్తుతం మూడు నెలల కోటాలో మొదటి విడత కొంత మొత్తంలో పంపారు. స్టాక్ ఖాళీ అయ్యేకొద్దీ బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అందరికీ పంపిణీ
ఈ నెల 30వరకు బియ్యం పంపిణీ ఉంటుంది. క్యూ లేకుండా ముందస్తుగా టోకెన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే షాపులకు ఎప్పటికప్పుడు స్టాక్ ఖాళీ అయ్యే కొద్దీ బియ్యం పంపిస్తాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోటాలు కలిపి ఒకేసారి వేలిముద్రలు తీసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. – బ్రహ్మారావు,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
నెలకు బియ్యం కేటాయింపు: 4313మెట్రిక్ టన్నులు
మూడు నెలలకు:
12939మెట్రిక్ టన్నులు(సుమారు)
జిల్లా ప్రజాపంపిణీ వివరాలు
సన్న బియ్యం కోసం లబ్ధిదారుల క్యూ
మూడు నెలలకు ఒకేసారి పంపిణీ
వేలిముద్రలు, తూకంలో జాప్యం
ఈ నెల 30వరకు పంపిణీకి గడువు
సజావుగా బియ్యం పంపిణీకి చర్యలు
కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్: జిల్లాలో రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఆయన నస్పూర్లోని చౌక ధరల దుకాణం–5, 8ను సందర్శించారు. బియ్యం పంపిణీని పరిశీలించారు. డీలర్లు, లబ్ధిదారులతో మాట్లాడారు. పంపిణీ వ్యవస్థలో సమస్యలపై తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతిక సమస్యలను ఈ–పాస్ ఇంజనీర్లు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో సన్న బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. రేషన్ బియ్యం పంపిణీని తహసీల్దార్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.

రేషన్కు బారులు