
సర్కారు బడి పిలుస్తోంది..!
● నేటి నుంచి 19వరకు బడిబాట ● ప్రవేశాల పెంపే లక్ష్యం ● ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ ● వీడియోల ద్వారా విస్తృత ప్రచారం
మంచిర్యాలఅర్బన్: పాఠశాలల పునః ప్రారంభ సమయం సమీపిస్తోంది. సర్కారు బడుల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా విద్యాశాఖ ఈ నెల 6నుంచి 19వరకు విద్యాశాఖ బడిబాట చేపడుతోంది. ఈ కార్యక్రమంలో పాఠశాలల్లో ఉచితంగా అందిస్తున్న విద్య, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దస్తులు, మధ్యా హ్న భోజనం, డిజిటల్ తరగతుల బోధన, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ల్యాబ్లు, మౌలిక సదుపాయాలపై ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు.
కార్యక్రమాలు ఇలా..
6న ప్రజలతో గ్రామసభలు, 7న ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లలను గుర్తించడం, 8 నుంచి 10వరకు కరపత్రాలతో ఇంటింటా ప్రచారం, అంగన్వాడీ కేంద్రాల సందర్శన, డ్రాపౌట్ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడం, 11న బడిబాట ఫలితాలపై సమీక్ష, 12న అమ్మ ఆదర్శ పాఠశాలల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల ప్రారంభం, ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందించడం, 13న సామూహిక అక్షరా భ్యాసాలు, బాలల సభ నిర్వహణ, 16న ఎఫ్ఎల్ఎ న్, లీప్ దినోత్సవం, 17న విలీన విద్య, బాలిక దినోత్సవం, 18న మొక్కల పెంపకం దినోత్సవం, తరగతి గదుల డిజిటలీకరణపై అవగాహన, 19న బడిబాట ముగింపు కార్యక్రమాలు, విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహిస్తారు.
పిల్లల ప్రవేశాలు పెంచేందుకు..
జిల్లాలో 1078 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా 1,25,412 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రభుత్వ యాజమాన్యంలో 2024–25లో 59,756 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు లక్ష్యాన్ని విధించి పిల్లలకు అడ్మిషన్లు కల్పిస్తుండడంతో సర్కారు పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు ముందస్తు ప్రవేశాలు కూడా చేపట్టారు. సర్కారు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ, కృతిమ మేధ(ఏఐ పాఠాలు), డిజిటల్ క్లాస్లు, ఆధునిక హంగులతో పాఠశాలలు తీర్చిదిద్దడం తదితర అంశాలపై విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ప్రవేశాల పెంపు లక్ష్యం..
ఈసారి నాలుగు వేల మంది పిల్లలను పాఠశాల(ఒకటో తరగతి)ల్లో చేర్పించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులున్నాయి. కృతిమ మేధ(ఏఐ), ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ విధానంతో డిజిటల్ తరగతుల బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, రెండు జతల దుస్తులు, రాగిజావ, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి తదితర వాటిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలను చేర్పించేలా కృషి చేస్తాం.
– యాదయ్య, డీఈవో
ముందస్తు బడిబాట
పైసా ఖర్చు లేకుండా పిల్లలకు గుణాత్మకమైన విద్యను అందిస్తూ ఉజ్వలమైన భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు సిద్ధమంటూ ఏప్రిల్లో వేసవి సెలవులకు ముందే సర్కారు పాఠశాలల టీచర్లు బడిబాట నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలపై కరపత్రాలు, వీడియోలు ఆకర్షణీయంగా రూపొందించి సోషల్మీడియా ద్వారా ప్రచారం చేశారు. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నారు. 2025–26 అడ్మిషన్లు ఓపెన్ పేరిట విద్యార్థుల ప్రవేశాలు చేపట్టారు.