
గర్భిణులకు స్కానింగ్ కష్టాలు
● గంటల తరబడి పడిగాపులు ● లక్సెట్టిపేట, చెన్నూర్లో రేడియాలజిస్టు కొరత ● బెల్లంపల్లిలో ఉన్నవారికి చెన్నూర్ ఇంచార్జి ● సీహెచ్సీల్లో స్కానింగ్ చేస్తేనే మేలు
రేడియాలజిస్టులను నియమిస్తేనే..
జిల్లాలోని మూడు సీహెచ్సీల్లో బెల్లంపల్లిలో మాత్రమే రేడియాలజిస్టు ఉన్నారు. ఇక్కడ శుక్రవారం మినహా ప్రతీరోజు స్కానింగ్ చేసేందుకు అందుబాటులో ఉంటారు. మూడు సీహెచ్సీలకు సూపరింటెండెంట్గా ఉంటూనే నేను లక్సెట్టిపేటకు మంగళవారం వెళ్లి స్కానింగ్ చేస్తున్నాను. బెల్లంపల్లి రేడియాలజిస్టు ప్రతీ శుక్రవారం చెన్నూరుకు వెళ్లి స్కానింగ్ చేస్తున్నారు. సరిపడా క్యాడర్ను ఇప్పటికీ కేటాయించకపోవడం వల్లనే లక్సెట్టిపేట, చెన్నూరులో వైద్యులు లేరు. వైద్యుల నియామకం చేపడితే, చెన్నూరు, లక్సెట్టిపేట ఆసుపత్రుల్లో నిత్యం స్కానింగ్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
– డాక్టర్ ఎం.కోటేశ్వర్,
డీసీహెచ్ఎస్ సూపరింటెండెంట్
మంచిర్యాలటౌన్: గర్భిణులకు స్కానింగ్ కష్టాలు త ప్పడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా అందుకు సరిపడా వైద్యుల నియామకం, వసతులు కల్పించడం లేదు. దీంతో ప్రభుత్వ వైద్యం కోసం వచ్చేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభు త్వ ఆస్పత్రుల్లో మాత్రమే ప్రసవాలు జరిగేలా చూ డాలని ప్రభుత్వం చెబుతుండగా.. అందుకు తగినట్లుగా జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో వైద్యసేవలు అందిస్తున్నారు. గర్భిణులు ప్రతీ రోజు వైద్య పరీక్షలు, స్కానింగ్ కోసం 60మందికి పైగా జిల్లాలోని పలు మండలాల నుంచి వస్తున్నారు. వీరితోపాటు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, మహారాష్ట్రకు చెందిన వారు వస్తుండడంతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. గర్భిణులకు వైద్యపరీక్షలతోపాటు స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. స్కానింగ్ టీఫా యంత్రం ఒకటే ఉండగా.. ఒక రేడియాలజిస్టు ఉన్నారు. ప్రతీ రోజు 60కి పైగా స్కానింగ్లకు రోజంతా సమయం పడుతోంది. దీంతో గర్భిణులు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కానింగ్ గది బయటే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. టీఫా స్కానింగ్లు చేయాల్సి వస్తే మరింత ఎక్కువ సమయం పడుతోంది.
సీహెచ్సీల్లో చేస్తేనే..
జిల్లా నలుమూలల నుంచి గర్భిణులు మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి వస్తున్నారు. ఎంసీహెచ్కు వచ్చే గర్భిణుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇక్కడ ఒత్తిడి తగ్గించేందుకు జిల్లాలోని చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల(సీహెచ్సీ)లో స్కానింగ్లను గతంలోనే ప్రారంభించారు. బెల్లంపల్లిలో మాత్రమే ఒక రేడియాలజిస్టు ఉండగా, లక్సెట్టిపేట, చెన్నూర్లో నియమించలేదు. దీంతో ఆయా ప్రాంతాల గర్భిణులు నేరుగా ఎంసీహెచ్కే వస్తున్నారు. బెల్లంపల్లి రేడియాలజిస్టుకు చెన్నూర్ ఇంచార్జి ఇవ్వగా.. ప్రతీ శుక్రవారం స్కానింగ్ చేస్తున్నారు. లక్సెట్టిపేటలో ఎవరూ లేక డీసీహెచ్ఎస్ సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ ఎం.కోటేశ్వర్ రేడియాలజిస్టు కావడంతో ప్రతీ మంగళవారం స్కానింగ్ చేస్తున్నారు. మూడు సీహెచ్సీల్లో స్కానింగ్ యంత్రాలతో టీఫా స్కానింగ్ చేయలేని పరిస్థితి ఉండడంతో టీఫా స్కానింగ్ కోసం ఎంసీహెచ్కే రావాల్సి వస్తోంది. మూడు సీహెచ్సీల్లో స్కానింగ్ యంత్రాలు మార్చి, రేడియాలజిస్టులను నియమిస్తే స్థానిక గర్భిణులు అక్కడే స్కానింగ్ చేసుకోవడం వల్ల వారికి దూరభారంతోపాటు రోజంతా వేచి ఉండే పరిస్థితి తప్పుతుంది. జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటే ఎంసీహెచ్పై భారం తగ్గడంతోపాటు గర్భిణులకు మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.