
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి
నెన్నెల: ప్రజల భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండలంలోని మెట్పల్లి, జెండావెంకటాపూర్ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని సందేహాలను నివృత్తి చేశారు. ఈ నెల 20వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రెండు బృందాలతో మండలంలోని రెండు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. దరఖాస్తులను రికార్డులతో సరి చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. మంచిర్యాల నుంచి నార్వాయిపేట వరకు ఆర్టీసీ బస్సు నడిపించాలని గ్రామస్తులు కోరగా సానుకూలంగా స్పందించారు. మైలారం గ్రామంలో చౌక ధరల దుకాణం, వరిధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించారు. రేషన్ సన్నబియ్యం ఈ నెల 30వరకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. తహసీల్దార్ మహేంద్రనాథ్, డెప్యూటీ తహసీల్దార్ ప్రకాష్ పాల్గొన్నారు.
రైతుల ఖాతాల్లో నగదు జమ
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.345 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. 29,645 మంది రైతుల నుంచి 1,98,307 టన్నుల ధాన్యం సేకరించామని పేర్కొన్నారు.