
అడెల్లు.. అమర్ రహే!
బోథ్: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడు దశాబ్దాల ఉద్యమ కెరటం నింగికెగిసింది. నూనుగు మీసాల ప్రాయంలో అడవిబాట పట్టి విప్లవోద్యమంలో అంచెలంచెలుగా ఎదిగిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజన్ ఇన్చార్జి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్(53) ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో అడెల్లు మృతిచెందాడు. ఉదయం నుంచి మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగి న కాల్పుల్లో తుదిశ్వాస విడిచాడు. బాల్యం నుంచి అభ్యుదయ భావాలు కలిగిన అడెల్లు మరణవార్త జిల్లాలోని పొచ్చెర గ్రామాన్ని కలిచివేసింది. 30 ఏళ్ల క్రితం జ్ఞాపకాలను ఆ ఊరు గుర్తు చేసుకుంది.
ఇదీ ప్రస్థానం..
అడెల్లు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర గ్రామం. తల్లిదండ్రులు పోతన్న–పోషవ్వకు నలుగురు సంతానం. పెద్ద అడెల్లు, సీతారాం, అడెల్లు, చిన్న అడెల్లు. తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. దున్నే వాడిదే భూమి నినాదం, పేదరికం అడెల్లును నక్సలిజం వైపు నడిపించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయనను 1989లో జరిగిన భూపోరాటం ఆకర్షించింది. అడెల్లు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, సోదరులతో కలిసి కూలీ పనులకు వెళ్తుండేవాడు. భూస్వాముల పెత్తందారీతనాన్ని తరచూ ప్రశ్నించేవాడు.
విద్యాభ్యాసం..
బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. 1989లో నిర్మల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. నిర్మల్లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో విప్లవ సిద్ధాంతాలకు ఆకర్షితుడై రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరాడు.
రాడికల్ నుంచి దళంలోకి..
రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చురుగ్గా పాల్గొనేవాడు. అధ్యక్షుడిగా పనిచేశాడు. గ్రామాల్లో ప్రజలను చైతన్యపరిచాడు. 1995ప్రాంతంలో నక్సలైటుగా మారి దళంలోకి ప్రవేశించాడు. మొదట బోథ్ దళ సభ్యుడిగా పని చేసిన ఆయన ఇంద్రవెల్లి డిప్యూటీ కమాండర్ స్థాయికి ఎదిగాడు. అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోకి వెళ్లాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పూర్తిస్థాయి పట్టు సాధించాడు. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తూ.. కరోనా సమయంలో ఉమ్మడి జిల్లాలో రిక్రూట్మెంట్ బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. గతంలో అడెల్లు దళాన్ని పట్టుకోవడమే లక్ష్యంగా పోలీస్ బలగాలు ఉమ్మడి జిల్లాలోని తిర్యాణి, మంగి, బోథ్, పెంబి, ఖానాపూర్, మామడ ప్రాంతాల్లో జల్లెడ పట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. పలుమార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నట్లు వినికిడి. 2020 సెప్టెంబర్ 19న కదంబ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో అడెల్లు తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం అడెల్లుపై రూ.25 లక్షల రివార్డు ఉంది.
కంతి లింగవ్వతో వివాహం..
అడెల్లుకు అప్పటికే దళంలో కొనసాగుతున్న నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కంతి లింగవ్వతో వివాహం జరిగింది. ఇద్దరూ కీలక సభ్యులుగా ఎదిగారు. లింగవ్వ జిల్లా కమిటీ సభ్యురాలిగా ప్రధాన భూమిక పోషించారు. మంగీ ప్రాంతంలో రిక్రూట్మెంట్ చేసినట్లు తెలుస్తోంది. 2022 డిసెంబర్లో లింగవ్వ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందింది. అప్పటి నుంచి అడెల్లు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోకి వెళ్లారని తెలుస్తోంది.
ఎట్లున్నడో అనుకునేలోపే చేదు వార్త
‘మావో’ల ఏరివేత లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగా ర్ పేరిట అడవుల్లో కూంబింగ్ షురూ చేసింది. ఎన్కౌంటర్లలో మావోయిస్టులు మృతి తరుణంలో అడెల్లు ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడోనని కుటుంబీకులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆయన మరణ వార్త వారి గుండెను చెరువు చేసింది. చివరి చూపు కోసం మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబీకులు, గ్రామస్తులు కోరుతున్నారు.
ముగిసిన ‘మైలారపు’ ప్రస్థానం
బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతి
మూడు దశాబ్దాలుగా అరణ్యంలోనే..
విషాదంలో పొచ్చెర గ్రామం
మృతదేహం అప్పగించాలంటున్న కుటుంబీకులు, గ్రామస్తులు
చివరి చూపు చూడాలని ఉంది
నా తమ్ముడు అడెల్లును చివరి చూపు చూడాలని ఉంది. చిన్నతనంలో ద ళంలోకి వెళ్లాడు. ప్రజల కోసమే పని చేశాడు. ఇంతకాలం ఎక్కడున్నా బతికే ఉన్నాడనే ఆశ ఉండేది. ఇప్పటికి దాదాపు 30 ఏళ్లు దాటింది చూసి. మృతదేహాన్ని అప్పగించాలని కోరుతున్నా. – మైలారపు సీతారం,
అడెల్లు సోదరుడు, పొచ్చెర
విచారణ జరగాలి
అడెల్లును పట్టుకుని కాల్చి చంపారని అనుమానం ఉంది. కగార్ పేరుతో నక్సలైట్లను కాల్చడం దారుణం. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాలి. ఆయన మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించాలి.
– బి.రమణయ్య, పొచ్చెర గ్రామం
అడెల్లు సోదరుడి ఇంటివద్ద గుమిగూడిన గ్రామస్తులు

అడెల్లు.. అమర్ రహే!

అడెల్లు.. అమర్ రహే!

అడెల్లు.. అమర్ రహే!