
ఆగిన లారీని ఢీకొన్న మరో లారీ
ఎర్రవల్లి: జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టిన ఘటనలో రెండు లారీలు దగ్ధమైన ఘటన మండల పరిధిలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కోదండాపురం ఎస్ఐ మురళీ కథనం మేరకు.. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లా దావూద్ గ్రామానికి చెందిన అజారుద్దీన్ ఆర్జే 14 జీజే 0965 నంబర్ గల లారీలో ఆలుగడ్డల లోడుతో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నుంచి బెంగుళూరుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో 44వ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వేములస్టేజీ వద్ద ఒక్కసారిగా లారీ ఇంజిన్ ఆగిపోవడంతో రోడ్డు పక్కగా ఆపి మరమ్మతు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఏపీ 21 టీజెడ్ 8969 నంబర్ గల బండల లోడుతో వెళ్తున్న లారీ అతివేగంతో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇరు లారీల డ్రైవర్లు, క్లీనర్లకు ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపుచేశారు. రెండు లారీలతో పాటు సుమారు రూ.10 లక్షల విలువైన ఆళుగడ్డలు బుగ్గిపాలైనట్లు డ్రైవర్ అజారుద్దీన్ వాపోయాడు. లారీ డ్రైవర్ అజారుద్దీన్ ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అలంపూర్ సీఐ రవిబాబు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు.
పూర్తిగా దగ్ధమైన రెండు లారీలు
రూ.10 లక్షల విలువైన
ఆలుగడ్డలు బుగ్గిపాలు

ఆగిన లారీని ఢీకొన్న మరో లారీ