
మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దు
జడ్చర్ల: మొక్కలు నాటి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.. కానీ, మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దు అంటూ ఎస్పీ జానకి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన వారోత్సవాల్లో భాగంగా సోమవారం జడ్చర్ల డీటీసీలో జరిగిన కార్యక్రమంలో యువత, విద్యార్థులతో కలిసి ఆమె మొక్కలు నాటి మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణతోపాటు మాదక ద్రవ్యాల నివారణ విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. యువతలో చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడుతాయన్నారు. యువత తమ భావోద్వేగాలను మాదకద్రవ్యాల వైపు మళ్లించకుండా ప్రకృతి వైపు మళ్లించాలని తద్వారా వారితోపాటు పర్యావరణ పరిరక్షణకు పాటుపడిన వారవుతారన్నారు. మాదక ద్రవ్యాలు మానవ జీవితాన్ని నాశనం చేసే వినాశకారక మార్గమని, అలాంటి దారి వైపు అడుగుపెట్టకూడదన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ సురేష్కుమార్, తెలంగాణ నార్కొటిక్ ఇన్చార్జ్ డీఎస్పీ బుచ్చయ్య, డీటీసీ డీఎస్పీ గిరిబాబు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు కమలాకర్, నాగార్జునగౌడ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసులను నేరుగాసంప్రదించండి : ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించే దిశగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను స్వయంగా ఎస్పీ తెలుసుకుని వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయం, మరో వ్యక్తి మధ్యవర్తిత్వం, పైరవీలకు తావులేకుండా నేరుగా పోలీసులను సంప్రదించాలన్నదే ప్రజావాణి కార్యక్రమం ఉద్దేశమన్నారు.
ఎస్పీ ఆదేశాల మేరకు షీ టీం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని చాణక్య ఉన్నత పాఠశాలలో షీ టీం, డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ ఈవ్ డ్రగ్స్, మత్తు పదార్థాలు, వాటి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ శైలజ, షీ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.