
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్రావుతో కలిసి ప్రజల నుంచి 156 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి అనంతరం అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ విద్య, సీజనల్ వ్యాధులపై సమీక్షించారు. మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా మెనూ ప్రకారం భోజనం అందేలా చూడాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, వంటశాల, స్టోర్రూం శుభ్రంగా ఉన్నాయా.. లేవా.. అని పరిశీలించాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ ల్యాబ్లను 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేశామన్నారు. ఈ నెలాఖరు వరకు సంసిద్ధతలో భాగంగా విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ అక్షరమాల, గణిత భావనలు, గుణింతాలు వంటివి నేర్పించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన గుడ్లను మాత్రమే తీసుకోవాలని, చిన్నవి, పాడైపోయినవి తీసుకోరాదని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా డెంగ్యూ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డెంగ్యూ కేసులు రిపోర్ట్ అయితే చికిత్స ప్రొటోకాల్ పాటించాలన్నారు. గతేడాది జిల్లాలో డెంగ్యూ వ్యాధిపై ఎక్కువ కేసులు నమోదయ్యాయని, ఈసారి అలా కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు.