
ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలి
పాలమూరు: పెద్ద ధన్వాడ వద్ద చేపడుతున్న ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని, ఇకపై తెలంగాణలో ఇథనాల్ కంపెనీల ఏర్పాటు మానుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడేవిధంగా ఇథనాల్ కంపెనీలు ఏర్పాటు చేస్తామని, ఆందోళనకారులపై చర్యలు తీసుకుంటామని బెదిరింపు గొంతుతో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడటం సరికాదని.. ఆయన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇథనాల్ కంపెనీల పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమీక్ష చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లాలో రద్దు చేసినట్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎందుకు రద్దు చేయడంలేదనే విషయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా జిల్లాను కాలుష్యం నుంచి రక్షించడం లేదన్నారు.
సెట్విన్ ఆధ్వర్యంలో ఫైనల్ పరీక్షలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్థానిక బీకేరెడ్డి కాలనీలోని ‘నవరత్నాలు’ శిక్షణ కేంద్రంలో బుధవారం సెట్విన్ ఆధ్వర్యంలో ఫైనల్ పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ మూడు నెలలపాటు కంప్యూటర్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్ కోర్సులలో శిక్షణ పొందిన రెండో బ్యాచ్కు చెందిన 247 మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలను సెట్విన్ హైదరాబాద్ కో–ఆర్డినేటర్ సత్యనారాయణరెడ్డి, మహబూబ్నగర్ డీవైఎస్ఓ శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఆయా కోర్సులలో ఉదయం థియరీ, మధ్యాహ్నం ప్రాక్టికల్స్ ప్రశాంతంగా జరిగాయి. ఇక డీవైఎస్ఓ సూపరింటెండెంట్ రవీందర్రెడ్డి, సెట్విన్ నిర్వాహకులు విజయకుమార్, ఎగ్జామినర్లు పి.వనజ, అజ్మత్ ఉన్సీస, తన్వీర్సుల్తాన్ పర్యవేక్షించారు. కాగా, కొత్తగా మూడో బ్యాచ్ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుందని ‘మహబూబ్నగర్ ఫస్ట్ – నవరత్నాలు’ పర్యవేక్షకులు గుండా మనోహర్ తెలిపారు. ఇప్పటివరకు సుమారు 550 మంది అభ్యర్థులు శిక్షణ పొందారని వివరించారు.
● పాలమూరు అధ్యయన వేదిక
కన్వీనర్ రాఘవాచారి