
శుభకార్యానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..
బంధువుల ఇంట్లో వివాహ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు దుర్మరణం చెందిన విషాదకర ఘటన నవాబుపేట మండలం కొల్లూరు గేట్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. నవాబుపేటకు చెందిన మరికంటి లక్ష్మమ్మ (52), ఆమె కుమారుడు యాదగిరి (20) కొందుర్గు మండలం ఆగిర్యాలలో జరిగిన బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యారు. వేడుక అనంతరం అక్కడి నుంచి స్వగ్రామానికి బైక్పై బయలుదేరారు. అయితే మార్గమధ్యంలోని కొల్లూరు గేట్ సమీపంలో అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ బైక్ను ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లీకొడుకుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడగా.. డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లీకొడుకు మృతితో నవాబుపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలు లక్ష్మమ్మకు మొత్తం ఐదుగురు సంతానం కాగా.. ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో మృతుడు యాదగిరి చివరి వాడు. మిగిలిన అందరి వివాహాలు జరిగాయి. మృతురాలి భర్త వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

శుభకార్యానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..