
ఏడు గంటల వ్యవధిలో కేసు ఛేదన
గద్వాల క్రైం: నిలిపి ఉంచిన 10 టైర్ల లారీని గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటనలో పోలీసులు ఏడు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ శనివారం తెలిపిన వివరాల మేరకు. ఈ నెల 5వ తేదీన తెల్లవారుజామున గద్వాల పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏపీ 39 వీడీ 6377 నంబర్ గల 10 టైర్ల గల లారీని నలిపి యాజమాని సాధిక్ ఇంటికి వెళ్లాడు. అయితే సాయంత్రం 3 గంటల సమయంలో వచ్చి చూడగా లారీ కనిపించలేదు. ఆందోళన చెందిన సాధిక్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సమీప సీసీ కెమెరాలను పరిశీలించగా లారీ ఎర్రవల్లి వైపుగా వెళ్తున్నట్లు రికార్డు అయ్యిందన్నారు. వాటి ఆధారంగా లారీని అపహరించిన దుండగులను పట్టుకునేందుకు సిబ్బంది టోల్ప్లాజాల వద్ద పహారాగా ఉండగా దుండగులు చాకచాక్యంగా వ్యవహరించారన్నారు. పెబ్బేరు, వనపర్తి, బిజనేపల్లి, బాలానగర్ మీదుగా రాయకల్ టోల్ప్లాజా సమీపంలోని ఓ దాబా వద్ద లారీని నిలిపిన దుండగులు నంబర్ను ఏపీ 39 డబ్ల్యూ 3553గా మార్పులు చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే సిబ్బంది లారీని గుర్తించి అక్కడికి చేరుకోవడంతో దుండగులు తప్పించుకున్నారన్నారు. శనివారం తెల్లవారుజామున లారీని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. లారీ విలువ రూ.15లక్షలు ఉంటుందన్నారు. కేసు చేధనలో సాంకేతిక విభాగ సిబ్బంది చంద్రయ్య, కిరణ్, రాజుయాదవ్ కీలకంగా వ్యవహరించారన్నారు. సీసీ కెమెరా రికార్డుల ద్వారా నిందితులను గుర్తించి త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.
చోరీకి గురైన రూ.15లక్షల విలువ గల లారీ స్వాధీనం
పరారీలో నిందితులు