
క్రికెట్లో ఉన్నతస్థాయికి ఎదగాలి
మహబూబ్నగర్ క్రీడలు: క్రికెట్లో జిల్లా క్రీడాకారిణులు ఉన్నతస్థాయికి ఎదగాలని మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో ఆదివారం ఉమ్మడి జిల్లా మహిళా క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన క్రీడాకారిణులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ పట్టుదలతో ఆడితే క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. అంతర్జాతీయ క్రీడాకారిణి మిథాలిరాజ్ను స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్లో రాణించాలని కోరారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా ఎంపికలకు 60 మంది క్రీడాకారిణులు హాజరయ్యారన్నారు. మూడు జట్లుగా విభజించి ఈ నెల 9, 10 తేదీల్లో లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తామన్నారు. లీగ్లో ప్రతిభ కనబరిచే వారిని త్వరలో జరిగే హెచ్సీఏ టోర్నమెంట్కు ఎంపిక చేస్తామని తెలిపారు. లీగ్ మ్యాచ్ల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మాజీ కౌన్సిలర్ నర్సింహులు, ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్కుమార్, వెంకటరామరావు, కోచ్లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, మన్నాన్, సీనియర్ క్రీడాకారులు ఆబెద్ హుస్సేన్, రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.