
వంద కిలోల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
మరికల్: మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం వంద కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మరికల్కు చెందిన శ్రీనివాసులు, ధన్వాడ మండలం హనుమాన్పల్లికి చెందిన డొంకాల వెంకటయ్య అనే ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి తెచ్చిన నకిలీ పత్తి విత్తనాలను కుమ్మరివాడలోని ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ చేశారు. అక్కడి నుంచి రైతులకు అమ్ముతున్నారు. ఈ క్రమంలో పక్క సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించగా నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. పట్టుబడిన విత్తనాలను పోలీస్స్టేషన్కు తరలించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాము తెలిపారు.
ఫారెస్టు భూమిని సాగు చేస్తున్న ట్రాక్టర్లు స్వాధీనం
● కేసు నమోదు
కొల్లాపూర్ రూరల్: మండలంలోని ముక్కిడిగుండం గ్రామ సమీపంలోని అడవిలో అక్రమంగా ఫారెస్టు భూమిని సాగు చేస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు రేంజర్ చంద్రశేఖర్ తెలిపారు. ట్రాక్టర్లను టింబర్ డిపోకు తరలించినట్లు తెలిపారు. ఆదివారం స్పెషల్ టీం స్ట్రైక్ఫోర్స్ అధికారి మగ్దూం, రేంజర్ చంద్రశేఖర్ సంయుక్తంగా నల్లమల అడవిని పరశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చుట్టుపక్కల అడవిలో అక్రమంగా భూమిని సాగు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అడవి హక్కుల పత్రాలు ఉన్న వారు కూడా అడవిని నరక కూడదన్నారు. అటవీ చట్టం ప్రకారం, 1967 చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. అనుమతి లేకుండా అడవిలో ట్రాక్టర్లతో దున్నె వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ విషయాలు అటవీ ప్రాంతంలోని ప్రజలు గమనించాలన్నారు.