
పశువుల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఖిల్లాఘనపురం: వ్యవసాయ పొలాల్లోని పశువుల పాకల్లో ఉన్న పశువులను రాత్రివేళలో దొంగలు తీసుకెల్లారు. ఈ కేసును ఖిల్లాఘనపురం పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని ఛేదించారు. బుధవారం కొత్తకోట సీఐ రాంబాబు, ఖిల్లాఘనపురం ఎస్ఐ సురేష్గౌడు పట్టుకున్న దొంగలను మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఖిల్లాఘనపురం మండలంలోని షాపురం గ్రామానికి చెందిన రైతులు కర్నెతండాకు వెళ్లే రోడ్డుకు దగ్గరలో ఉన్న పశువుల పాకలో ఉన్న 8 ఎద్దులు, ఒక ఆవును ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున దొంగలు తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన మామిళ్ల మాసయ్య, భీమయ్య, వెంకటయ్య, నాగన్నలు ఎద్దులు పోయినట్లు ఫిర్యాదు చేయడంతో నాటి నుంచి ఎస్పీ రావుల గిరిధర్ పర్యవేక్షణలో ఎద్దులను తీసుకెళ్లిన దొంగల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం మండలంలోని తిర్మలాయపల్లి గేట్ దగ్గర వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో నిందితులను పట్టుకున్నట్లు వారు తెలిపారు. తనిఖీ చేస్తున్న క్రమంలో అనుమానం రావడంతో మహ్మద్ సిరాజ్, మహ్మద్ ఆమెర్ ఖురేషీలను పట్టుకుని విచారణ చేయగా, వారు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. 27న మరో మారు గ్రామాల్లో దొంగతనం చేసేందుకు మరో ముగ్గురు వ్యక్తులు హస్మత్, రఫీక్ ఉధ్ధీన్, షాహబాజ్లతో కలిసి మండలానికి వచ్చినట్లు తెలిపారు. పశువులకు ఇచ్చే మత్తు ఇంజక్షన్ కోసం ముగ్గురు వెళ్లి ఎంతకు తిరిగి రాలేదు. దీంతో సిరాజ్, అమోర్లు బుధవారం మండలం నుంచి వాహనంలో తిరిగి వెళ్తున్న సమయంలో తనిఖీలో పట్టుపడ్డారని చెప్పారు. వీరు షాపురం గ్రామంలో 8 ఎద్దులు, ఒకటి ఆవును తీసుకెళ్లడం జరిగిందని ఒప్పుకోవడం జరిగిందన్నారు. పశువులను హైదరాబాద్ తీసుకెళ్లి రూ.1.80 లక్షలకు అమ్మినట్లు విచారణలో తెలిపారు. నిందితుల నుంచి దొంగతనానికి వాడిన ఆటోను, ఓ కారు, రూ.1.80 లక్షల నగదును స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనం కేసును ఛేదించిన ఖిల్లాఘనపురం ఎస్ఐ సురేష్గౌడు, సిబ్బంది పి.లింగం, బి.రాజు, చైతన్యకుమార్, ఎండీ మునావర్లను సీఐ అభినందించారు.