
కేంద్ర పథకాలు క్షేత్రస్థాయికి చేరాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని దిశ కమిటీ చైర్మన్, ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన దిశ కమిటీ సమావేశంలో ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. కేంద్రం నిధులతో రాష్ట్ర ప్రభుత్వ వాటాలతో కొనసాగుతున్న పథకాలు ఎలాంటి లోపాలు లేకుండా అమలు చేయాలన్నారు. రాష్ట్రీ య కృషి వికాస్ యోజన ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయడానికి 252 యూనిట్లకు రూ.72.20 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. పథకంపై అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ఎంపిక చేయాలన్నారు. జాతీయ ఆయిల్ సీడ్ మిషన్ కార్యక్రమం కింద వంట నూనెల ఉత్పత్తికి 2025– 26 నుంచి వేరుశనగ సాగును కేంద్రం ప్రోత్సహిస్తుందన్నారు. జిల్లాలో 1,250 ఎకరాల్లో మూడేళ్లపాటు రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా వేరుశనగ సాగు చేయడానికి రెండు సంస్థలను ఎంపిక చేశామన్నారు. జిల్లాలో వరి తర్వాత ఎక్కువగా పత్తి సాగు చేస్తారని, ప్రత్యామ్నాయ పంటల సాగు కింద భూసారం పెరిగేందుకు డిమాండ్ ఉన్న వేరుశనగ పంట ద్వారా పల్లి నూనె ఉత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ రంగంలో వినూత్న ఒరవడి, సాగు యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
● వైద్యారోగ్య శాఖ ద్వారా సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, మెదడు వాపు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులపై విస్తృత ప్రచారం చేసి పరీక్షలు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా, సీ సెక్షన్ తగ్గించేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
● జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ సాఫీగా నిర్వహించాలని, ధాన్యం కొనుగోలులో మహిళా సంఘాలకు వచ్చే కమీషన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
● గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెల పెంపకంతో జీవనాధారం కలిగిన వారికి రూ.20 లక్షల మేర చిన్న యూనిట్గా తీసుకుని లబ్ధి చేకూరే విధంగా బ్యాంకర్లు రుణ సహాయం అందించాలన్నారు.
● అటవీ శాఖ జింకల పార్కు కోసం ప్రత్యేక ప్రాజెక్టు రూపొందించి సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
● మహిళాశిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్న వర్కింగ్ మహిళా హాస్టల్లో అన్ని వసతులు కల్పించి ఎక్కువ సంఖ్యలో చేరేలా చూడాలన్నారు. బ్యాంకర్లు వివిధ ప్రభుత్వ శాఖలు ఎంఎస్ఎంఈఎంపీఎంఎఫ్ ఈ పథకాలకు రుణ సహాయం అందించాలన్నారు.
● జిల్లాలో డీఎంఎఫ్ నిధుల ద్వారా ప్రధానమంత్రి క్షేత్ర కల్యాణ యోజన పథకం అమలు, గనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మోహన్రావు, శివేంద్రప్రసాద్, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, డీఏఓ వెంకటేశ్, డీఆర్డీఓ నర్సింహులు, డీఎంహెచ్ఓ కృష్ణ, డీసీఓ శంకరాచారి, అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, డీపీఓ పార్థసారధి, ఆర్డీఓ నవీన్, గనుల శాఖ ఏడీ సంజయ్కుమార్, ఎల్డీఎం భాస్కర్ పాల్గొన్నారు.
దిశ సమావేశంలో కమిటీ చైర్మన్, ఎంపీ డీకే అరుణ