
కరోనాపై అప్రమత్తం
● ముందస్తుగా జనరల్ ఆస్పత్రిలో 60 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు
● జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న వైద్యాధికారులు
పాలమూరు: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్న క్రమంలో జిల్లాలోనూ వైద్య, ఆరోగ్యశాఖతోపాటు జనరల్ ఆస్పత్రి వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. దీంతో జనరల్ ఆస్పత్రిలో కోవిడ్ భవనంలో 60 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు, 50 వెంటిలేటర్స్, ఆక్సిజన్ ప్లాంట్స్కు మరమ్మతు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు రావడం, వర్షాలు కురుస్తుండటంతో చల్లని గాలుల వల్ల చాలామంది దగ్గు, జలుబు, జ్వరం బారినపడుతున్నారు. ఐసీఎంఆర్తోపాటు ప్రభుత్వ నిబంధల ప్రకారం జనరల్ ఆస్పత్రిలో ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ సంపత్కుమార్ సింగ్ వెల్లడించారు. సీజనల్ వ్యాధులతోపాటు కరోనా వైరస్ కోసం ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు, డ్రగ్స్ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్స్ మరమ్మతు ప్రక్రియ ప్రారంభించామన్నారు. లక్షణాలు ఉన్నవారు ఎవరూ భయాందోళనకు గురి కాకుండా పరీక్షలు చేసుకోవాలని, దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు వారం కంటే ఎక్కువగా ఉంటే ఆస్పత్రిలో సంప్రదించాలని సూచించారు.
భయపడొద్దు..
ప్రస్తుతం వస్తున్న కరోనా వైరస్ వల్ల భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కృష్ణ తెలిపారు. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండటం, మాస్క్, చేతులు తరుచుగా శుభ్రం చేసుకోవడంతోపాటు వారం రోజుల పాటు లక్షణాలు ఉంటే కరోనా టెస్ట్ చేసుకొని ఐసోలేషన్ ఉంటే సరిపోతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉంటున్నామని చెప్పారు.

కరోనాపై అప్రమత్తం