
బేస్మెంట్ బిల్లులు అందాయా..
భూత్పూర్: బేస్మెంట్ బిల్లులు అందాయా అని ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో సోమవారం రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మండలంలోని భట్టుపల్లిలో 13 మంది లబ్ధిదారులు బేస్మెంట్ వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోగా వారికి రూ.లక్ష చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సబావట్ జుమ్ని తనతోపాటు బేస్మెంట్ వరకు నిర్మాణం చేపట్టిన వారికి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశారని, తనకు ఎంతో సంతోషంగా ఉందని మంత్రికి వివరించారు. తాను రేకుల షెడ్డులో నివాసం ఉంటూనే తన కుమారుడు బీటెక్, కుమార్తె లా కోర్సు చదివిస్తున్నానని చెప్పడంతో మంత్రి జుమ్నిని అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో మీలాంటి మహిళలు తమ పిల్లలకు ఉన్నత స్థాయి చదువులు చెప్పించడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ భాస్కర్, ఎంపీడీఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుతో వీసీలో
మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి