
ఒకేసారి మూడు నెలలకు..
మహబూబ్నగర్ రూరల్: వర్షాకాలంలో వచ్చే వరదలు, ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకొని తిండి గింజల నిల్వ, రవాణాలో అంతరాయం తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశాల్లో పేర్కొనడంతో ఆ దిశగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం మొత్తం 15,684 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమని భావిస్తున్నారు.
జూన్ 1 నుంచి 30 వరకు..
జిల్లాలోని 17 మండలాల్లో 506 చౌకధర దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,53,229 మంది కార్డుదారులకు జూన్ 1 నుంచి 30 వరకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. సాధారణంగా ప్రతి నెలా 1 నుంచి 17 వరకు మాత్రమే బియ్యం పంపిణీ చేసేవారు. కానీ, కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో జూన్ నెల మొత్తం పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ కోటా బియ్యం తీసుకెళ్లాల్సి ఉండగా, అందుకు ఒక్కొక్కరు మూడు సార్లు బయోమెట్రిక్ పెట్టాల్సి ఉంటుంది. ఒక కార్డుదారుడు వరుసగా రెండు, మూడుసార్లు వేలిముద్రలు స్వీకరించే అవకాశం పీఓఎస్లో లేదు. ఈ లెక్కన కార్డుదారులు చౌకధర దుకాణాల్లో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి వస్తుంది. ఈ విషయమై కేంద్రం పీఓఎస్ (బయోమెట్రిక్ మిషన్)లో ఏమైనా మార్పులు చేస్తుందేమో వేచిచూడాలి.
డీలర్లకు ఇబ్బందే..
మూడు నెలల రేషన్ కోటా ఒకేసారి పంపిణీ చేసేందుకు 15,684 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని మూడు ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా ఇప్పటికే రేషన్ దుకాణాలకు బియ్యం రవాణా చేపడుతున్నారు. కాగా మూడు నెలల రేషన్ కోటా బియ్యం ఒకేసారి దిగుమతి చేసుకునేందుకు స్థలం లేకపోవడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు.
జూన్లో బియ్యం పంపిణీకిఅధికారుల కసరత్తు
వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
జిల్లాకు 15,684 మెట్రిక్ టన్నులుఅవసరం
దుకాణాలకు చేరుతున్న సన్నబియ్యం
దిగుమతికి డీలర్ల తంటాలు