
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
పాలమూరు: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో కలుషితమైన నీరు, నీటి నిల్వల ద్వారా దోమలు వృద్ధి చెంది అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని డీఎంహెచ్ఓ కృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాకాలంలో పరిశుభ్రమైన నీటిని మాత్రమే తాగాలని, తాగునీటిపై ఎప్పుడూ మూతలు ఉంచాలన్నారు. నీటిని కాచి చలార్చిన తర్వాత తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. దోమల ద్వారా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు వ్యాధులు వస్తాయని, వీటి నివారణకు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, నీటి నిల్వ లేకుండా చూడాలన్నారు. శరీరాన్ని పూర్తి దుస్తులతో కప్పి ఉంచాలన్నారు. ఎలాంటి జ్వరం వచ్చిన ఆస్పత్రిలో సంప్రదించి తప్పక రక్తపరీక్షలు చేసుకోవాలని సూచించారు.
నేడు పీఎఫ్
సమస్యలపై సదస్సు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పీఎఫ్ ఖాతాదారుల సమస్యల పరిష్కారానికి గాను మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో ‘నిధి ఆప్కే నిక్కత్–2’ నిర్వహించనున్నామని రీజినల్ పీఎఫ్ కమిషనర్–1 తేజ్ప్రతాప్సింగ్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు సదస్సులు మహబూబ్నగర్లోని సీఎంఆర్ షాపింగ్ మాల్, నాగర్కర్నూల్ మున్సిపల్ కార్యాలయం, వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కార్యాలయం, నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకాలలోని ఎన్ఎస్ ఎంటర్ప్రైజెస్ (బీడీ మాన్యుఫ్యాక్చర్స్), గద్వాల పీఏసీఎస్లో, రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని మున్సిపల్ కార్యాలయంలో, వికారాబాద్ జిల్లా తాండూరులోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో కొనసాగుతాయన్నారు. అలాగే హైదరాబాద్ పరిధిలోని షేక్పేట్ నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ కళాశాలలో, హైదరాబాద్ పీఎఫ్ రీజినల్ ఆఫీస్–2లో జరుగుతాయన్నారు. ఈ అవకాశాన్ని పీఎఫ్ ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక
మహబూబ్నగర్ క్రీడలు: సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో వచ్చేనెల 1న జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను సోమవారం జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఎంపికలను జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ప్రారంభించి మాట్లాడారు. అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల్లో 60 మంది బాల, బాలికలు పాల్గొన్నారు. అండర్– 8 విభాగంలో బాల, బాలికలకు 60 మీ., 200 మీ., టెన్నిస్బాల్ త్రో, స్టాండింగ్ బ్రాడ్ జంప్, అండర్–10 విభాగంలో బాల, బాలికలకు 60 మీ., 300 మీటర్ల పరుగు, లాంగ్జంప్, కిడ్స్ జావెలిన్, అండర్–12లో బాల, బాలికలకు 60 మీ., 300 మీ., 600 మీటర్ల పరుగు, లాంగ్జంప్, షాట్పుట్, కిడ్స్ జావెలిన్ అంశాల్లో ఎంపికలు నిర్వహించామన్నారు. ఆయా క్రీడాంశాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని, వారి వివరాలు తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.