
బాధితులు మధ్యవర్తులను తీసుకురావొద్దు
మహబూబ్నగర్ క్రైం: ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని ఎస్పీ జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పోలీస్ సేవలు ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత నేరుగా ఆయా స్టేషన్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదిదారుడితో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. రెవెన్యూకు సంబంధించిన భూ సమస్యల విషయంలో సంబంధిత తహసీల్దార్లతో సమన్వయం చేసుకొని వ్యవహరించాలన్నారు. జిల్లాలోని పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులు మధ్యవర్తులతో కాకుండా.. నేరుగా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవాలని సూచించారు.