
కలుపును ఇలా నివారిద్దాం
అలంపూర్ : వానాకాలం సాగు సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. పంటల సాగులో కలుపు సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కలుపు వలన 30 నుంచి 70 శాతం పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అయితే కలుపు నివారణకు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పంట నష్టం జరగకుండా చూడొచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సూచిస్తున్నారు. వరిలో ఊడల నిర్మూలనకు విత్తనాన్ని నాటిన 14 రోజులకు ఎకరా నారుమడికి ప్రిటిలాక్లోర్ 400 మి.లీ లేదా సైహాల్పాప్బ్యూటైట్ 400 మి.లీ ద్రావకాన్ని 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. లేదా ఊద వెడల్పాకు కలుపు సమపాళ్లలో ఉంటే నారుమడి విత్తిన 15 రోజులకు ఎకరాకు బిస్ పైరిబాక్ సోడియం(10) శాతం 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి.
మాగాణి వరిలో..
మాగాణి వరిలో ఊద వంటి ఏకవార్షిక గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉంటే నాటిన 3 లేదా 5 రోజుల్లో పొలంలో పలుచగా నీరుంచి ఎకరాకు 1–1.5 లీ. బుటాక్లోర్ (50 శాతం) లేదా 400 మి.లీ చొప్పున అనిలోఫాస్ (30 శాతం) ప్రిటిలోక్లోర్ (50 శాతం) గానీ 20 కిలోలు పొడి ఇసుకలో కలిపి చల్లాలి. గడ్డి, తుంగ వెడల్పాటి ఆకు జాతీ మొక్కలు సమపాళ్లలో ఉంటే వరి నాటిన 3 లేక 5 రోజుల్లో 4కి బుటాక్లోర్ 5 శాతం గుళికలు+4కి 2.4–డీ ఇథైల్ ఎస్టర్ 4 శాతం గుళికలను 20 కిలోల ఇసుకలో కలిపి చల్లాలి. నాటిన 20 నుంచి 30 రోజుల్లో వెడల్పాటి కలుపు ఎక్కువగా ఉంటే ఎకరాకు 400 గ్రాములు 2.4–డీ సోడియం సాల్ట్ (80 శాతం) లేదా ఇథాక్సి సల్ఫురాన్ 15 శాతం పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మొక్కజొన్న : మొక్కజొన్న విత్తిన వెంటనే లేదా 2–3 రోజుల్లో ఎకరాకు 1–1.5 కిలోల అట్రాజీన్ పిచికారీ చేయాలి. తర్వాత 30–35 రోజుల్లో గొర్రు గంటుకతో అంతర్ కృషి చేయాలి.
జొన్న : జొన్న విత్తిన వెంటనే లేదా 2–3 రోజుల్లో 600 నుంచి 800 గ్రాముల అట్రాజిన్ను విత్తిన 20 రోజుల తర్వాత అలాగే 400 గ్రాముల 2, 4–డీ సోడియం సాల్ట్ 80 శాతం పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం మంచిది.
కంది : కంది విత్తిన వెంటనే 1–2 రోజుల్లో ఎకరాకు 1.1.3 లీ పెండి మిథాలీన్ వాడాలి. విత్తిన 30 లేక 60 రోజుల్లో గొర్ర గుంటకతో అంతర్ కృషి చేయాలి. లేదా ఇమజితాపీర్ ఎకరాకు 200 మి.లీ పిచికారి చేయాలి.
మినుము/పెసర : విత్తిన 1–2 రోజుల్లో ఎకరాకు 1–1.3 లీ పెండి మిథాలీన్ను విత్తిన 20 రోజులకు గడ్డి జాతి కలుపు నివారణకు 250 మి.లీ పెనాక్స్ ప్రాప్ ఇథైల్ 5 శాతం మందును 200 లీటర్ల నీటిలో కలిపి చల్లితే ప్రయోజనం ఉంటుంది.
మినుములు : పొలంలో గడ్డిజాతి వెడల్పాకు ఉంటే ఎకరాకు 200 మి.లీ ఇమిజితాపిర్ 10 శాతం పొడితో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందు చల్లితే మినుము పెరుగుద ల ఆగినప్పటికీ తిరిగి మాములు స్థితికి వస్తోంది.
శనగ : పైర్లు విత్తిన వెంటనే లేదా ఒకటి లేక రెండు రోజుల్లో ఎకరాకు 1–1.3 లీ. పెండిమిథాలీన్ పిచికారీ చేయాలి. సోయా చిక్కుడులో విత్తిన 20 రోజుల సమయంలో 250 మి.లీ ఇమజితాపిర్ మందు కూడ పిచికారీ చేయవచ్చును.
కూరగాయ పంటల్లో :
వంగ, టామాటో, ఉల్లి, వెల్లుల్లి పంటలు నాటడానికి ముందు ఎకరాకు 1–1.3లీ పెండామిథాలీన్ లేదా 200 మి.లీ ఆక్సీఫ్లోరాపెన్ పిచికారీ చేయాలి. ఉల్లి, వెల్లుల్లిల్లో నాటిన 15–20 రోజులకు నేలలో తేమ చూసుకొని 200 మి.లీ ఆక్సీఫ్లోరోఫెన్ కూడా వాడవచ్చు. బెండలో విత్తిన వెంటనే లేదా 12 రోజుల్లో ఎకరాకు 1–1.3 లీ. పెండిమిథాలీన్ లేదా 1.5–2 లీటర్ల అలాక్లోర్ చల్లాలి. క్యాబేజి, కాలీఫ్లవర్లో నాటడానికి 1 లేదా 3 రోజుల ముందు ఎకరాకు 200 మి.లీ ఆక్సీఫ్లోరోఫెన్ చల్లాలి. కంద, చేమ పెండలం వేస్తే కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దఫా తడి వచ్చాక ఎకరాకు 1.3 లీటర్ల పెండిమిథాలీన్ లేదా ఆక్సీఫ్లోరోఫెన్ పిచికారీ చేయాలి.

కలుపును ఇలా నివారిద్దాం