
హడలెత్తిస్తున్న చిరుతలు..!
కోయిల్కొండ: మండలంలో వివిధ ప్రాంతాల్లో చిరుతల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత పులులు అటవీ ప్రాంతాలను వదిలి సమీపంలో ఉన్న పంటచేల వైపు, కొండ ప్రాంతాల వైపు సంచరిస్తుండడంతో రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. మేతకు వెళ్లిన పశువులపై దాడి చేసి చంపేస్తుండడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఐదేళ్లుగా మండలంలో చిరుతపులల సంచారం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో 12పైగా చిరుతపులులు?
జిల్లాలో అటవీ ప్రాంతాలలో 12 నుంచి 15కు పైగా చిరుతపులులు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో కోయిల్కొండ మండలంలో 5 నుంచి 6 వరకు చిరుత పులులు ఉన్నాయని, ఇవి ఒకే ప్రాంతంలో కాకుండా 40–70 కిలోమీటర్లు రోజు ప్రయాణం చేస్తుంటాయని అధికారులు తెలుపుతున్నారు. మండలంలో బూర్గుపల్లి, దమాయపల్లి, ఇబ్రహీంనగర్, భవానిసాగర్, కోయిల్కొండ, కనాయపల్లి, సూరారం, కేశ్వాపూర్ ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజల కంటపడ్డాయి. బూర్గుపల్లి, తిర్మలంపల్లి, పల్గుతాండ, కేశ్వాపూర్ గ్రామాలలో ఇప్పటికే అనేక పశువులను హతమార్చాయి. నెలకు ఒక్కసారైన పశువులపై దాడి చేసి చంపేసిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో నీటి లభ్యత లేకపోవడంతో పాటు ఆహారం కోసం గ్రామాల్లోకి వస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు.
భయాందోళనలో రైతులు
చిరుతలు తరచూ పంట చేలవైపు వస్తుండడంతో రైతులు, కూలీలు పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు. వానాకాలం ప్రారంభంకానుండడంతో సాగు పనులు ముమ్మరం కానున్నాయి. ఈ క్రమంలో పులుల సంచారంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. పశువులను మేపేందుకు వెళ్లాంటే కాపరులు హడలిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో పంటచేలకు వెళ్లే రైతులు కూలీలు గుంపులు గంపులుగా వెళ్తూ చీకటి పడకముందే ఇంటికి చేరుకుంటున్నారు.
పశువులపై దాడులు..
కోయిల్కొండ, ఇబ్రహీంనగర్లో వరుసగా లేగదూడ, మేక పిల్లలపై చిరుతపులి దాడి చేసింది. బూర్గుపల్లిలో నాలుగు గేదెలపై దాడి చేసేందుకు యత్నించగా గేదెలు తిరగబడడంతో చిరుతపులికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అటవీశాఖ అధికారులు చిరుతపులికి జూపార్కులో చికిత్స చేయించగా నెల రోజుల తర్వాత మృతి చెందింది. అదే విధంగా పల్గుతండాకు చెందిన రైతు లేగదూడను, బూర్గుపల్లిలో మరో రైతు గేదెను, కేశ్వాపూర్లో ఎద్దును, చన్మన్పల్లిలో ఆవును ఇలా పలు గ్రామాల పరిసర ప్రాంతాల్లో పశువులపై దాడి చేసి చిరుతపులులు హతమార్చాయి. అంతేకాక వారం రోజులుగా మండల కేంద్రంలోని ఫింజర్గుట్టపై చిరుతపులి కనిపిస్తుండడంతో యువకులు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారాయి.
ఫింజర్ గుట్టపై కనిపించిన చిరుత
భయాందోళనలో ప్రజలు
అడవులకు వెళ్లొద్దని సూచిస్తున్న అధికారులు
చిరుతల కదలికలపై నిఘా...
మండలంలో చిరుతపులులు సంచరిస్తుండడంతో వాటి కదలికలపై నిఘా పెట్టాం. చిరుతపులుల దాడి చేసి హతమార్చిన పశువుల కళేబరాలతో పాటు వాటి పాదముద్రలను సేకరిస్తున్నాం. ఎటునుంచి ఎటువైపు వెళ్తున్నాయని తెలుసుకునేందుకు చర్యలు చేపట్టాం. అయినా రైతులు జాగ్రత్తగా ఉండాలి. చిరుతలను బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – సత్యనారాయణ, జిల్లా ఫారెస్ట్ అధికారి