
వక్ఫ్ సవరణ చట్టం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
స్టేషన్ మహబూబ్నగర్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆలిండియా ముస్లిం పర్సనల్లా బోర్డు అధ్యక్షుడు ఖాలిద్ సైఫుల్లా రహ్మెని, కర్ణాటక మాజీ ఎంపీ సీఎం ఇబ్రహీం, కోల్కత్తాకు చెందిన మౌలానా అబు తాలిబ్ రహెమాని అన్నారు. మహబూబ్నగర్లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి ఆలిండియా ముస్లిం పర్సనల్లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారీ నిరసన సభ నిర్వహించారు. వేలాదిగా ముస్లింలు పాల్గొన్న ఈ సభలో ముఖ్య అతిథులుగా వారు పాల్గొని మాట్లాడారు. వక్ఫ్ సవరణ చట్టం వల్ల ముస్లింలకు తీరని నష్టం జరుగుతుందని, వక్ఫ్ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులను కాజేయడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలంతా ఏకమవుదామని పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతు ఇచ్చిన నితీష్కుమార్, చంద్రబాబునాయుడులకు ముస్లింలు తగిన బుద్ధిచెప్పాలని కోరారు. ముస్లిం ప్రముఖులు నిసార్ హుస్సేన్, హమీద్ఖాన్, హుసాముద్దీన్, మతీనుద్దీన్ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆలిండియా ముస్లిం పర్సనల్లా బోర్డు నిర్వహించే నిరసన కార్యక్రమాలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. సభలో ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్బలాల, కన్వీనర్ మౌలానా నయీం కౌసర్ రషాది, రజాక్షాఖాద్రీ, మౌలానా ఖాజా ఫైజొద్దీన్, టీజీఎంఎఫ్సీ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ఖాద్రీ, హాఫిజ్ ఇద్రీస్, అబ్దుల్ హాదీ, జాకీర్ అడ్వకేట్, జాబెర్ బిన్ సయీద్, అజ్మత్అలీ తదితరులు పాల్గొన్నారు.