
గుప్తనిధుల కోసం తవ్వకాలు
బల్మూర్: మండలంలోని కొండనాగుల గ్రామ సమీపంలోని గుడిబండ శివాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు తరచూ జరుగుతున్నా పోలీసులు దుండగులను పట్టుకోలేక పోతున్నారని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి దుండగులు తవ్వకాలు జరిపి అలికిడి కావడంతో సామగ్రి అక్కడే వదిలి పారిపోయిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. శివాలయం ఎదురుగా ఉన్న చెట్ల పొదల్లో నాలుగు గడ్డపారలు, పారలు, సుత్తెలు, మాస్కులు, గ్లౌజ్లతో పాటు పూజ సామగ్రి ఉండటాన్ని పశువుల కాపరి గమనించి గ్రామస్తులకు తెలుపగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తవ్వక సామగ్రిని స్టేషన్కు తరలించారు.
తరచూ తవ్వకాలు..
మూడేళ్లలో నాలుగుసార్లు గుప్త నిధుల కోసం గుదిబండ శివాలయంలో తవ్వకాలు జరిపారు. గత మూడు నెలల క్రితం గుర్తు తెలియని దుండగులు శివాలయంలోని బండను తొలగించి తవ్వకాలు జరిపారు. శివాలయం గ్రామానికి దూరంగా రెండు కిలో మీటర్ల దూరంలో వ్యవసాయ పొలాల్లో ఉండటంతో దుండగులు ఎలాంటి భయం లేకుండా తరచూ గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. గుడిలో భారీ ఎత్తున్న గుప్తనిధులు ఉన్నట్లు ప్రచారం ఉండటంతో వివిధ ప్రాంతాలకు చెందిన దుండగులు నిత్యం తవ్వకాలు జరుపుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. గుప్తనిధుల కోసం తవ్వకాలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేసి దుండగులను పట్టుకొని శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రమాదేవి తెలిపారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
సంఘటన స్థలంలో సామగ్రి, పూజ వస్తువులు
గుదిబండ శివాలయంలో తరచూ గుప్తనిధుల వేట