
నిషేధిత బీజీ–3 పత్తి విత్తనాల పట్టివేత
జడ్చర్ల: ప్రభుత్వం నిషేధించిన బీజీ–3 పత్తి విత్తనాలను శనివారం జిల్లా వ్యవసాయ శాఖ, పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు. ఈర్లపల్లితండాలో గుంటూరు, మాచర్ల ప్రాంతాల నుంచి గుట్టుగా లూజ్ పత్తి విత్తనాలను దిగుమతి చేసుకుని రైతులకు విక్రయిస్తున్నారన్న సమాచారం అందడంతో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా అధికారులకు విషయాన్ని చేరవేశారు. దీంతో వ్యవసాయ శాఖ జడ్చర్ల పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్, సీఐ కమలాకర్ తాండాలోని పలువురు రైతుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తనిఖీలలో మేఘనాథ్ చంద్య దగ్గర 30 కిలోలు, మేఘనాథ్ రవి దగ్గర 15 కిలోల బీజీ–3 పత్తి విత్తనాలు దొరికాయి. మొత్తం 45 ప్యాకెట్లను వారి నుంచి స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుని జడ్చర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. విత్తనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించి పరీక్షిస్తామని అధికారులు తెలిపారు.
ఈర్లపల్లితండాలో గుట్టుగా పత్తి విత్తనాల నిల్వలు
ఇద్దరు నిందితుల అరెస్ట్