
పకడ్బందీగానిర్వహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామపాలన అధికారి పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీసీలో మాట్లాడారు. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు అభ్యర్థులను హాల్లోకి అనుమతించారు. ఒక్క నిమిషం అలస్యమైన అనుమతి లేదని, పరీక్ష ముగిసే వరకు బయటికి వెళ్లేందుకు వీల్లేదని తెలిపారు. పరీక్ష కేంద్రాల చుట్టూ పక్కల జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. పరీక్షలు ముగిసిన తర్వాత జవాబు పత్రాలను సీల్ చేసి జేఎన్టీయూహెచ్కు అందించాలని, ఉపయోగించని జవాబు పత్రాలను కూడా తప్పనిసరిగా పరీక్ష కేంద్రాల నుంచి సేకరించాలన్నారు. అనంతరం కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో చైతన్య హైస్కూల్లో పరీక్షకేంద్రం ఏర్పాటు చేశామని, 152 మంది అభ్యర్థులు రాయనున్నట్లు వెల్లడించారు. వీసీలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీఓ నవీన్, చీఫ్ సూపరింటెండెంట్ మహమ్మద్ అహ్మద్, కలెక్టరేట్ ఏఓ శంకర్, తదితరులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
దేవరకద్ర: నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి హెచ్చరించారు. శనివారం దేవరకద్ర పోలీసుస్టేషన్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కొందరు వ్యాపారులు గ్రామాల్లో తిరిగి నకిలీ బీజీ పత్తి విత్తనాలు విక్రయిస్తారని, అలాంటి వారి పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. గ్రామాలకు వచ్చే నకిలీ విక్రయదారుల సమాచారం పోలీసులకు ఇస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులను మోసం చేసే ఏ వ్యాపారి అయినా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. దేవరకద్రలో ప్రతి బుధవారం సంతలో కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వీటిని అరికట్టడానికి మఫ్టీలో పోలీసులను పెడతామని తెలిపారు. కొత్త మండలాలు కౌకుంట్ల, గండేడ్లలో త్వరలో కొత్త పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించి నేరాలకు సంబంధించి నమోదు అవుతున్న కేసులపై ఆరా తీశారు. అనంతరం దేవరకద్ర రైల్వే స్టేషన్ పరిసరాలను ఎస్పీ పరిశీలించారు. ఆమె వెంట ఎస్ఐ నాగన్న ఉన్నారు.
30న ఇంటర్వ్యూలు
పాలమూరు: జిల్లా ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ పథకం కింద కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ డాక్టర్ కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి మెడికల్ ఆఫీసర్, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒకటి పారా మెడికల్ అసిస్టెంట్ పోస్టులను ఒక ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 30న డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని, అర్హులైన బలహీన గిరిజన అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు.
పాలిసెట్లో
42 శాతం ఉత్తీర్ణత
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పాలిసెట్ ఫలితాల్లో మహబూబ్నగర్ జిల్లా విద్యార్థులు 42శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లావ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో మే 13 పరీక్ష నిర్వహించగా 3,187 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాకేంద్రానికి చెందిన ఉందాల్య కౌశిక్ నారాయణ రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు. అలాగే ఆవిషెట్టి ధనుష్తేజ 34వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కుటుంబసభ్యులు, మిత్రులు అభినందించారు.

పకడ్బందీగానిర్వహించాలి