
ముంపు నివారణకు తక్షణ చర్యలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ముంపు నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆదేశించారు. ఈ మేరకు మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. పెద్దచెరువు పక్క నుంచి నిర్మిస్తున్న వరదకాల్వ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ఎర్రకుంట తూముతో పాటు అలుగు నుంచి వేర్వేరుగా ఇమాంసాబ్కుంట వరకు శాశ్వత ప్రాతిపదికన సుమారు కిలోమీటరున్నర మేర డ్రెయినేజీ నిర్మించాలని అందుకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. మధ్యలోని రాయచూర్ మెయిన్రోడ్డుపై గతంలో రెండు చోట్ల ఉన్న కాజ్వేల వెడల్పును పెంచి పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముందుగా ఎక్కడికక్కడ డ్రెయినేజీలలో మురుగు నిల్వ ఉండకుండా శుభ్రం చేయించాలన్నారు. కాగా, ఈనెల 21వ తేదీ ఉదయం, రాత్రి సుమారు 4.30 గంటల పాటు జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అదే రోజు ఆయా ప్రాంతాలను జిల్లా ఉన్నతాధికారులు పర్యటించి పరిస్థితిని అంచనా వేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సమావేశం నిర్వహించడం గమనార్హం. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, ఇన్చార్జ్ ఎంఈ సందీప్వరల్డ్, పబ్లిక్ హెల్త్ ఈఈ విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు.
పెద్దచెరువు పక్కన వరద కాల్వ పూర్తి చేయాలి
ఎర్రకుంట నుంచి డ్రెయిన్ల విస్తరణ తప్పనిసరి
స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్