
5 నుంచి రెవెన్యూ సదస్సులు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో పైలెట్ మండలంగా మూసాపేటను ఎంపిక చేశామని, ఈ నెల 5 నుంచి ఆ మండలంలోని అన్ని గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో భూ భారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. మూసాపేట మండలంలో అన్ని గ్రామాల్లో రెవెన్యూసదస్సులు నిర్వహించేందుకు తహసీల్దార్ల ఆధ్వర్యంలో రెండు రెవెన్యూ టీంలను ఏర్పాటు చేశామని, ఒక్కో టీంలో ఏడుగురు సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. ప్రతిరోజు రెండు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చక్రాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో, తునికినిపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. 6వ తేదీన జానంపేట మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో, వేముల రైతు వేదిక, 7వ తేదీన పోల్కంపల్లి రైతువేదికలో, సంకల్మద్ది రైతు వేదిక, 8వ తేదీన కొమిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం, నందిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, 9వ తేదీన మహమ్మద్ హుస్సేన్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో, నిజాలాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో, 12వ తేదీన తిమ్మాపూర్ గ్రామపంచాయతీ, దాసరపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో, 13వ తేదీన కనకాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తారని కలెక్టర్ వెల్లడించారు. రెవెన్యూ సదస్సులలో ప్రభుత్వమే నిర్ణీత ప్రొఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను ఇస్తోందని, రైతులు వాటిని నింపి, సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి, రెవెన్యూ సదస్సుల్లో అధికారులకు అందజేయాలని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్లో నిక్షిప్తం చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ కలెక్టర్ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న
కలెక్టర్ విజయేందిర