● కలెక్టర్ స్నేహ శబరీష్
మహబూబాబాద్: అక్రమంగా దత్తత తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్నేహశబరీష్ హెచ్చరించారు. మహిళా శిశు సంక్షేమశాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దత్తత సహాయక కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. దత్తతపై అవగాహన కల్పించడానికే కేంద్రం ఏర్పాటు చేశారన్నారు. అంతర్జాతీయ దత్తత, విదేశీ, బంధువుల నుంచి దత్తత తదితర విషయాలపై పూర్తిస్థాయిలో సిబ్బంది అవగాహన కల్పిస్తారన్నారు. పిల్లలను దత్తత తీసుకునే దంపతులు వాత్సల్య పోర్టల్ ద్వారా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగవాణి, బాలల రక్షా భవన్ కో ఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, డీసీపీఓ కమలాకర్, బాలల సంరక్షణ అధికారులు నరేష్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.


