వరంగల్ చౌరస్తా/ఖిలా వరంగల్: హైదరాబాద్లో మే 10న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ జనాగ్రహ సభను విజయవంతం చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపెల్లి వెంకటరమణారెడ్డి కోరారు. వరంగల్ హంటర్ రోడ్డులో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన సత్యం కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడోసారి ప్రధానిగా ఎనికై న తర్వాత మొదటిసారి హైదరాబాద్కు వస్తున్నారని, ఇక్కడ అధికారం లేకపోయినా తెలంగాణ అభివృద్ధి కోసం రూ.7,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును విగిపోయే విధంగా చేయడం సిగ్గు చేటన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని అబద్దపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. గ్రీన్ ఫీల్డ్, యాదాద్రి గుట్టకు ఎంఎంటీఎస్, వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాకతీయ మెగా టెక్స్ టైల్స్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. తెలంగాణలో గ్రామ సచివాలయాలకు వీబీజీరామ్ ద్వారా నిధులు మంజూరు చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మహిళల గోస తగులుతుందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీలు జనార్ధన్ రెడ్డి, వన్నాల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర అధికార ప్రతినిధులు దశమంతరెడ్డి, వన్నాల వెంకటరమణ, చాడ శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల అశోక్ రెడ్డి, కంభపాటి పుల్లారావు, మల్లాడి తిరుపతి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, జలగం రంజిత్, నరేష్, హరిశంకర్, ప్రభాకర్, రాణాప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి


