● ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు
హన్మకొండ : రైతు డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. గురువారం హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పేరిట రేవంత్రెడ్డి తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్లో సభ పెట్టారన్నారు. అయితే రెండేళ్లు పూర్తయిన రైతు డిక్లరేషను అమలు చేయలేదని దుయ్యబట్టారు. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని రెండుసార్లు ఎగ్గొట్టారన్నారు. రైతులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని వివరించేందుకు వరంగల్లో ఈనెల 6న రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ధ్వజమెత్తారు. మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య మాట్లాడుతూ రెండున్నరేళ్లలో రాష్ట్రంలో 813 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రాజకీయ లబ్ధికోసం సీఎం రేవంత్రెడ్డి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రియాదవ రెడ్డి, సీనియర్ నాయకుడు భరత్ కుమార్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు యాదగిరి, సారంగపాణి, రమేశ్, నాయకులు నయిమొద్దీన్, వేణు, రజినీకాంత్, రవీందర్ రావు, వెంకన్న, శ్రీధర్, రాజు, సుమిత్ జోసఫ్, గౌస్ ఖాన్, ఇస్మాయిల్, రజినీకుమార్, తదితరులు పాల్గొన్నారు.


