మహబూబాబాద్: మొన్నటి వరకు గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నేడు పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. బంకుల్లో వాహనదారులు బారులుదీరుతున్నారు. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. కాగా, డీజిల్ కోసం క్యాన్లు, డబ్బాలను క్యూలైన్లలో పెట్టారు. వాహనాలు కిలోమీటర్ల కొద్ది క్యూలో ఉన్నాయి పోలీసు బందోబస్తు నడుమ విక్రయాలు చేస్తున్నారు. కొన్ని బంకుల్లో ద్విచక్రహనాలకు రెండు నుంచి మూడు లీటర్లు, నాలుగు చక్రాల వాహనాలకు రూ.2,000 ఇధనం మాత్రమే విక్రయిస్తున్నారు.
కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు..
జిల్లాలోని పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఈనెల 26వ తేదీ వరకు పూర్తిగా డీజిల్ లేక ఇబ్బందులు పడ్డారు. ఈనెల 27న పెట్రోల్ లేకపోవడంతో వాహనదారులకు తిప్పలు తప్పలేదు. ఎట్టకేలకు జిల్లా కేంద్రంలోని ఫాతిమా హైస్కూల్ ఎదుట ఉన్న బంక్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద బంక్తో పాటు మండలంలోని పలు బంకుల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా అయింది. దీంతో వాహనదారులు బారులు దీరారు. కిలో మీటర్ల కొద్ది దూరంలో వాహనాలు నిలిచిపోయాయి.
పోలీస్ బందోబస్తు నడుమ విక్రయాలు..
కొరతతో విక్రయాలు చేసే పరిస్థితి లేక పోలీసు బందోబస్తు నడుమ అమ్మకాలు చేస్తున్నారు. అది కూడా ద్విచక్రవాహనాలకు రెండు నుంచి మూడు లీటర్లు, ఫోర్వీలర్ అయితే రూ.2,000 వరకు మాత్రమే విక్రయాలు చేస్తూ ఆంక్షలు విధించారు. ఈనెల 27న మానుకోట మున్సిపాలిటీ పరిధిలో తొర్రూరు రోడ్డులో ఉన్న బంకు వద్ద వాహనదారులు బంకులో పనిచేసే సిబ్బందితో తీవ్ర వాగ్వాదం చేశారు. కాగా పెట్రోల్ కొరతపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు.
కొరత లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు
ప్రస్తుతం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంపెనీల ప్రతినిధులతో మాట్లాడినం. స్టాక్ వస్తుంది. సమస్య పరిష్కరిస్తాం.
– రమేశ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
బంకులవద్ద వాహనదారుల బారులు
క్యూలో క్యాన్లు, డబ్బాలు
పోలీసు బందోబస్తు నడుమ విక్రయాలు
పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు


