హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నికం, చతుస్థానార్చన, వసంతోత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఉత్సవమూర్తికి విమానకసేవ (సర్వభూపాల సేవ), సాయంత్రం చతురన్తసేవ నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం, సాయంత్రం పూజలకు రజక సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు ఉభయదాతలుగా వ్యవహరించారు. మహిళలు అమ్మవారి శ్రీచక్రానికి కుంకుమపూజ చేశారు. రాత్రి ఎమ్మెల్సీ తీన్నార్ మల్లన్న, మమత దంపతులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.


