నెహ్రూసెంటర్: రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ట్రాన్స్ఫార్మర్ వాహనాలను అందుబాటులో ఉంచినట్లు మహబూబాబాద్ ఎస్ఈ పి.విజేందర్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో 12 డిపార్ట్మెంట్ వాహనాలు ఏర్పాటు చేశామని, ఇందులో ప్రతీ వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేశామని తద్వారా సత్వర సేవలు అందుతాయన్నారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా అత్యంత ప్రాధాన్యమని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాహనాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్న సమయంలో వెంటనే మరమ్మతులు చేయడం లేదా ప్రత్యామ్నాయ ట్రాన్స్ఫార్మర్ అమర్చడం కోసం ఈ వాహనాలు ఎంతగానో దోహదపడుతున్నాయని తెలిపారు. రైతులు విద్యుత్ సంబంధిత సమస్యలు వచ్చిన వెంటనే సమీప విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయంగా ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ పరికరాలను తాకొద్దని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లో సమస్యలు తలెత్తిన వెంటనే 1912 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించడం ఎన్పీడీసీఎల్ ప్రధాన లక్ష్యమని, ప్రతీ ఉద్యోగి బాధ్యతతో పనిచేసి రైతుల ఆదరణ పొందాలన్నారు.


