మహబూబాబాద్: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా అడివయ్య మాట్లాడుతూ.. దివ్యాంగులకు పింఛన్ రూ.6,000 చెల్లించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు ఇచ్చి 150 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వర్రె బాలకృష్ణ, నాయకులు గౌరమ్మ, నరేష్, సుధాకర్, నాగలక్ష్మి, యాకమ్మ, నాగరాజు, వెంకన్న, గీత తదితరులు పాల్గొన్నారు.
కోట సందర్శన
ఖిలా వరంగల్: ఖిలావరంగల్ కోటను సోమవారం సాయంత్రం ఎయిర్పోర్ట్ అథారిటీ అధి కారులు ఈడీ ఎస్కె.గుప్తా, జై గౌరవ చౌదరి, జేజీఎం బాలెన్దర్ కుమార్, డీజీఎంలు ఉమేశ్కుమార్ తివారి, ఏజీఎం గోపాలకృష్ణ సందర్శించారు. మధ్యకోటలోని శిల్పకళా నైపుణ్యాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఖుష్ మహల్, ఏకశిల గుట్ట, రాతి మట్టికోట అందా లను వీక్షించారు. అంతకు ముందు కాకతీయు ల చారిత్రక విశిష్టతను కోట గైడ్ రవి యాదవ్ అధికారులకు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, ఆర్ఐ కీర్తిన్, పురావస్తుశాఖ కో–ఆర్డినేటర్ శ్రీకాంత్, టీజీటీడీసీ కోట ఇన్చార్జ్ గట్టికొప్పుల అజయ్ పాల్గొన్నారు.
కొనసాగుతున్న కల్యాణ బ్రహ్మోత్సవాలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నికం, చతుస్థానార్చన, డోలోత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఉత్సవమూరిక్తి భద్రపీఠసేవ, సాయంత్రం అశ్వవాహన సేవ నిర్వహించారు. ఉదయం అఖిల భారత పద్మశాలి సంఘం వరంగల్, హనుమకొండ, గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా మేయర్ గుండు సుధారాణి, ప్రభాకర్ దంపతులు, విశిష్ట అతిథిగా కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు, పండ్లు సమర్పించారు. వీరితో పాటు వడ్నాల నరేందర్, ఆడెపు రవీందర్, బచ్చు ఆనందం,గోరంట్ల రాజు, బేతి అశోక్, బత్తుల రమేశ్, బాబు, కుసుమ శ్యామ్, రాజేందర్, వేణు, సమ్మయ్య, కేదాసి వెంకటేశ్వర్లు, దిడ్డి రమేశ్, తుమ్మ అశోక్, వేణుగోపాల్, పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే సాయంత్రం ఎరుకల కులస్తులు ఉభయదాతలుగా వ్యవహరించారు. దేవర యాదగిరి, శ్రీలత దంపతులు పాల్గొన్నారు.


