కేసముద్రం: ప్రమాదవశాత్తు నిప్పంటుకుని 15 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని తాళ్లపూసపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దొంతరబోయిన కొమురయ్య 3 ఎకరాలు, సురేశ్ 2 ఎకరాలు, ఐలయ్య 3 ఎకరాలు, జక్కుల కట్టమల్లు 3 ఎకరాలు, ఐలయ్య 4 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. ఈ క్రమం రైతులు సగం వరకు కంకులను ఏరి కుప్పలుగా పోసుకోగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. గమనించిన రైతులు, స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కానీ, అప్పటికే పూర్తిస్థాయిలో మొక్కజొన్న కంకులు కాలిపోయాయని, మొత్తం రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. షార్ట్ సర్క్యూట్తోనే మొక్కజొన్న పంటకు నిప్పంటుకుందని వారు పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి విద్యుత్ అధికారులు చేరుకుని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరగలేదని ఏఓ రాజు తెలిపారు.
తాళ్లపూసపల్లిలో ఘటన


