పాలకుర్తి టౌన్: పోలీసుల ఆధ్వర్యంలో మైనర్ల డ్రైవింగ్పై అవగాహన కల్పిస్తూ.. కఠిన ఆంక్షలు పెడుతున్నప్పటికీ తల్లిదండ్రులు పెడచెవిన పెడుతున్నారు. మైనర్లకు వాహనాలను అప్పగిస్తుండడంతో పలువరు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొంత మంది గాయాలపాలవుతున్నారు. కొన్ని సమయాల్లో మైనర్లతో పాటు ఎదురుగా వస్తున్న వాహనదారులు సైతం ప్రమాదాల బారినపడుతున్నారు.
ఇటీవల జరిగిన ఓ ప్రమాదం..
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరులో ఈనెల 25న 12 సంవత్సరాల బాలుడు ట్రాక్టర్ నడిపి ఎదురుగా వచ్చిన కారు తప్పించబోయాడు. దీంతో ట్రాక్టర్ బోల్తాపడి పక్కన కుర్చున మరో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మూడేళ్ల జైలు శిక్ష
మైనర్ల డ్రైవింగ్పై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. మైనర్లకు వాహనాలిస్తే సదరు యాజమానులు, వాహనం నడిపిన మైనర్ తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తున్నారు. మోటర్ వాహన చట్టం 1988 సెక్షన్ 199(ఏ) ప్రకారం వాహనం ద్వారా మైనర్లు రోడ్డు ప్రమాదాలకు కారకులైతే తండ్రిని దోషిగా పరిగణిస్తారు. అలాగే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25వేల జరిమానా విధిస్తారు. కఠిన నిబంధనలున్నా.. మైనర్ డ్రైవింగ్లు, ప్రమాదాలు మాత్రం తప్పట్లేదు.
మైనర్లు వాహనాలు నడిపితే
కఠిన చర్యలు
మైనర్లు వాహనాలు నడపడం, వారిని ప్రోత్సహించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు తమ పిల్ల లకు ద్విచక్రవాహనాలు ఇస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటాం. మైనర్ వాహనం నడుపుతూ పోలీసులకు దొరికితే వాహనం సీజ్ చేస్తాం. మైనర్ డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగి ఎదుటి వ్యక్తి మరణిస్తే వాహనం నడిపిన మైనర్కు జైలు, రూ.25 వేల వరకు జరిమానా, యజమానికి సైతం మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.
– దూలం పవన్కుమార్, ఎస్సై, పాలకుర్తి
మైనర్ల డ్రైవింగ్తో ప్రమాదాలు
తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు
మైనర్లకు వాహనం ఇస్తే చర్యలు
ప్రమాదం జరిగితే మైనర్తో పాటు వాహనం ఇచ్చినవారిపై కేసులు


