గార్ల: రెండు నెలలపాటు పాకాల ఏటిలో నీళ్లు లేక బండలు తేలి వెలవెలబోగా.. శనివారం ఏరు చెక్డ్యాం నిండి అలుగు పోస్తూ జలకళ సంతరించుకుంది. దీంతో యువకులు ఏటిలో జలకాలాడుతూ కేరింతలు కొట్టారు. కాగా, రెండు నెలలుగా ఏటిలో నీళ్లు లేకపోవడంతో పరీవాహక ప్రాంతంలో సాగుచేసిన వరిపంటలకు సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. తీరా పంటలు కోసే సమయంలో ఏరు నిండింది. కాగా, రెండు నెలల ముందు ఏటికి పైనుంచి నీళ్లు విడుదల చేస్తే తమ పంటలు సమృద్ధిగా పండేవని రైతులు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా వేసవిలో గార్ల పట్టణ ప్రజలు, పశువుల దాహార్తిని తీర్చేందుకు పాకాల ఏటికి నీళ్లు చేరుకోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


