● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా స్వీయ జనగణనలో పాల్గొనాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జనగణన, సాదాబైనామా తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమం జనాభా గణన అన్నారు. ఈ నెల 26న నుంచి మే 10వ తేదీ వరకు జిల్లాలో స్వీయ గణన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఇళ్లు, జనాభా గణన మొదటి దశ మే 11 నుంచి జూన్ 26వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ప్రతీ ఇంటి సమాచారం నమోదు చేస్తారన్నారు. మొదట ప్రాథమిక సమాచారం సేకరిస్తారన్నారు. కచ్చితమైన, సంపూర్ణమైన వివరాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో 1,764 మంది సిబ్బందికి విధులు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించాలన్నారు. మన ఇసుక–మన వాహనం పథకం ద్వారా ఆన్లైన్లో మాత్రమే ఇసుక విక్రయాల కూపన్లు పంపిణీ చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, సీపీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


